
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. గోదావరిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యారు. ఇందులో ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
నీటిలో తప్పిపోయిన నలుగురు యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నీటిలో గల్లంతైన యువకులను మహాదేవపూర్ మండలంలోని అంబటిపల్లి, కొర్లకుంట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అంబటిపల్లి గ్రామానికి చెందిన నలుగురు, కొర్లకుంట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు.
శనివారం (జూన్ 7) సాయంత్రం గోదావరిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో యువకులు గల్లంతు అయినట్లు స్థానికులు వెల్లడించారు. నలుగురు యువకులు నీటిలో గల్లంతు కావడంతో అంబటిపల్లిలో గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. బాధిత యువకుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.