దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను చంపేస్తానని బెదిరించిన శ్లోక్ త్రిపాఠి అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు, ఘాజియాబాద్ పోలీసులు సంయుక్త ఆపరేషన్లో అరెస్టు చేశారు. అతడు తాగిన మత్తులో, భార్యతో గొడవ పడిన నేపథ్యంలో అలా అన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయింది. నిందితుడిని కొత్వాలి ప్రాంతంలో పట్టుకున్నారు. కాగా నిందితుడి లొకేషన్ పంచవటి ప్రాంతంలో గుర్తించారు. బెదిరింపుకు ఉపయోగించిన సిమ్ అడ్రస్ గోరఖ్పుర్కు చెందింది, పైగా అది అతడి బంధువు పేరిట తీసుకున్నదని వెల్లడయింది.
శ్లోక్ త్రిపాఠి ఇదివరలో ఘాజియాబాద్ కోర్టులో పనిచేశాడు. ప్రస్తుతం అతడు మీరట్లో ఎల్ఎల్బి డిగ్రీ చేస్తున్నాడు. పోలీసుల కథనం ప్రకారం అతడు 2020లో వివాహం చేసుకున్నాడు. అతడి భార్య అతడికి దూరంగా ఢిల్లీలోని నరేలాలో వేరుగా ఉంటోంది. నిందితుడు ఆమెను వేధించేవాడని సమాచారం. అతడిని అరెస్టు చేశాక ఘాజీయాబాద్ పోలీసులు అతడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. వారు తమ కస్టడీలో అతడిని గట్టిగా విచారిస్తున్నారని సమాచారం.