
మృగశిర కార్తె అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది చేప మందు ప్రసాదం. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిని కుటుంబ సభ్యులు ఏటా ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ చేప మందు ప్రసాదం కోసం కేవలం ఒక్క హైదరాబాద్ నుండి మాత్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల నుండి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. బత్తిని కుటుంబీకులు పంపిణీ చేస్తున్న చేప మందు.. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు లాంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి చాలా మంచిదని ఎన్నో ఏళ్లుగా నమ్మకంతో ఇక్కడి వస్తుంటారు బాధితులు. అయితే.. ఈసారి కూడా చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సుమారు 170 సంవత్సరాల నుంచి చేప ప్రసాదాన్ని బత్తిన వంశస్థులు ఆస్తమా రోగులకు పంపిణీ చేస్తున్నారు. ఈ యేడు కూడా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జూన్ 8, 9 తేదీల్లో నిర్వహించే బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ జరగనుంది.. జూన్ 8వ తేదీన మృగశిర ప్రవేశిస్తుండగా.. ఏర్పాట్లు పూర్తయినట్టు బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రోగులు, వారి సహాయకుల కోసం భోజనం, వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారి కోసం ఆర్టీసీ 140 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. నగరంలో అన్ని చోట్ల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ మందు కోసం వేలాది మంది ప్రజలు ఇప్పటికే హైదరాబాద్కు చేరుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి