. 2 minutes

గ్రేట్ ఉమెన్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన వెనక మాధవీ లత.. ఇంతకీ ఎవరీమే..?

Caption of Image.

మహిళలు తల్చుకుంటే ఏదైనా సాధ్యమే అని మరోసారి నిరూపించారు సివిల్ ఇంజనీర్ మాధవి లత. మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అనే కొందరికి తన సక్సెస్‎తో గుక్క తిప్పుకోలేని సమాధానం ఇచ్చారు. పురుషుల కంటే మహిళలు దేంట్లో తక్కువ కాదని.. అన్ని రంగాల్లో వారికి ధీటుగా రాణించగలరని మరోసారి ఆమె ప్రూవ్ చేశారు. ఇంత ప్రత్యేకంగా చెప్పుకుంటున్న ఈ మాధవి లత ఎవరు..? ఆమె ఏం సాధించారు..? ఎందుకు వార్తల్లో నిలిచారో తెలుసుకుందాం.

ఎవరీ మాధవి లత..?

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన ఎట్టకేలకు ప్రారంభమైంది. 2025, జూన్ 6న ప్రధాని నరేంద్ర మోడీ చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. చీనాబ్ రైల్వే బ్రిడ్జి భారతీయ ఇంజనీరింగ్ సాధించిన గొప్ప విజయంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అయితే.. ఎంతో ప్రతిష్టాత్మకమైన  చీనాబ్ రైల్వే బ్రిడ్జి ప్రారంభోత్సవం తర్వాత ఒక మహిళ పేరు మోరుమోగిపోతుంది. ఆమె మాధవి లత. ప్రముఖ సివిల్ ఇంజనీర్ అయిన మాధవి లత చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. దాదాపు 17 సంవత్సరాల పాటు ఆ వంతెన నిర్మాణం కోసం ఆమె పని నిర్విరామంగా పని చేశారు. 

చీనాబ్ వంతెన నిర్మాణంలో కీ రోల్ ప్లే చేసిన మాధవి లత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరులో ప్రొఫెసర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన రాక్ ఇంజనీరింగ్ ఎక్స్‎పర్ట్. చీనాబ్ వంతెన కాంట్రాక్టర్ ఆఫ్కాన్స్ కోరిక మేరకు లత వంతెన నిర్మాణ పనులకు మార్గనిర్దేశం చేశారు. 17 సంవత్సరాలు చీనాబ్ వంతెన నిర్మాణానికి ఆమె తన జీవితాన్ని అంకితం చేశారు. చీనాబ్ బ్రిడ్జి ప్రాజెక్టు సలహాదారుగా వ్యవహరించిన మాధవి లత.. వంతెన వాలు స్థిరీకరణ, పునాది వేయడానికి నాయకత్వం వహించారు. 

వంతెన నిర్మాణ ప్రారంభంలో మాధవి లత తనతో పాటు ఐఐఎస్‎సీ నుంచి మరొక ఇంజనీర్‌ను ప్రాజెక్ట్ సలహాదారుగా నియమించుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అతను ప్రాజెక్ట్ నుండి నిష్క్రమించాడు. అయినప్పటికీ మాధవి లత వెనక్కి తగ్గకుండా ధైర్యంగా వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రాజెక్ట్ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు. 2025, జూన్ 6న ఎట్టకేలకు చారిత్రాత్మకమైన చీనాబ్ వంతెన ప్రారంభం కావడంతో మాధవి లత పేరు వార్తల్లో వినిపిస్తోంది. దీంతో మాధవి లతపై ప్రశంసలు వర్షం కురుస్తోంది. గ్రేట్ ఉమెన్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

చీనాబ్ వంతెన ప్రత్యేకతలు:

చీనాబ్ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన. ఇది ఐఫెల్ టవర్ కంటే ఎత్తైనది. దీని మొత్తం ఖర్చు రూ. 1,486 కోట్లు.  ఇది జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించారు. ఈ వంతెన నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే సుమారు 35 మీటర్లు ఎక్కువ. దీని మొత్తం పొడవు 1,315 మీటర్లు.

నిర్మాణ ప్రత్యేకతలు..

దీనిని ఉక్కు ,కాంక్రీటుతో నిర్మించారు. 28వేల660 మెగా టన్నుల ఉక్కును ఉపయోగించారు. -10 డిగ్రీల నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత మార్పులను తట్టుకునేలా, అలాగే గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలులను, భూకంపాలను తట్టుకునేలా ఈ  వంతెనను నిర్మించారు. ఈ వంతెన జీవితకాలం 120 సంవత్సరాలు అని అంచనా. 8 తీవ్రతతో వచ్చే భూకంపాన్ని కూడా తట్టుకోగలదు. ఈ వంతెన కాశ్మీర్ లోయకు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీని గణనీయంగా పెంచుతుంది. ఇది ఈ ప్రాంతంలో పర్యాటకం, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది.

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.