నగరంలోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో శనివారం సెల్ఫోన్ పేలిన ఘటనలో ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సజీవ దహనమయ్యాడు. ఛార్జింగ్ పెట్టి కాల్ మాట్లాడుతుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. సాయి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మంటల ధాటికి అతడి శరీరం కాలిపోయింది. సాయి మృతితో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. చేతికి అందిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సెల్ఫోన్ పేలుడు షార్ట్ సర్క్యూట్కు కూడా దారితీసి ఉంటుందని అనుమానిస్తున్నారు. సాయి వయసు 27 సంవత్సరాలు అని, జగద్గిరిగుట్ట రింగుబస్తీలో తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడని పోలీసులు వెల్లడించారు. తల్లిదండ్రులు శనివారం ఉదయం గుడికి వెళ్లగా, సాయి ఇంటి వద్దే ఉన్నాడు. ఆ సమయంలో ఈ పేలుడు జరిగింది. ఇంటి నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు, మంటలు రావడాన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు అతడి తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు.
సాయి తల్లిదండ్రులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ఇల్లు మొత్తం పొగలు వ్యాపించాయి. సాయి మంటల్లో కాలిపోయి మృతి చెందినట్టు గుర్తించారు. మొబైల్ ఛార్జింగ్ పెట్టి కాల్ మాట్లాడుతుండగా పేలి ఉండొచ్చని పోలీసులు అను మానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం మృతదేహాన్ని గాంధీకి హాస్పిటల్కు తరలించారు. ఈ ప్రమాదంపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ మధ్యే కామారెడ్డి జిల్లాలో సాయిలు అనే యువకుడు, అన్నమయ్య జిల్లాలో ప్యాంట్ జేబులో మొబైల్ పేలి మరో యువకుడు చనిపోయారు. ఛార్జింగ్ పెట్టి కాల్ మాట్లాడడం చాలా ప్రమాదకరమని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నా యువత పెడచెవిన పెడుతున్నారు. సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉన్నప్పుడే ఫోన్లు వాడడం, మాట్లాడుతుండడం చేస్తున్నారు. ఇక, నాసిరకమైన బ్యాటరీలు, పాత బ్యాట రీలు పేలిపోయేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.