
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘హరిహర వీరమల్లు’. పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ కొంత భాగాన్ని తెరకెక్కించగా, జ్యోతి కృష్ణ బ్యాలెన్స్ షూట్ను చిత్రీకరించాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు నిర్మించారు. జూన్ 12న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ మూవీ పోస్ట్ పోన్ కానుందనే న్యూస్ గత కొన్ని రోజులుగా వినిపిస్తుండగా శుక్రవారం టీమ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే పలుమార్లు ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం కచ్చితంగా రిలీజ్ చేద్దామని అవిశ్రాంత ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరడం లేదని మేకర్స్ ఓ నోట్ను విడుదల చేశారు.
‘కష్టమైనప్పటికి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రతిష్టాత్మక చిత్రాన్ని మరింత గొప్పగా మలచాలనేదే మా ప్రయత్నం. ప్రతి ఫ్రేమ్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాం. అందుకే మేము మరి కొంత సమయం తీసుకుంటున్నాం. మీ ఎదురుచూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాం. ఆలస్యమైనా చరిత్ర సృష్టించడానికి సిద్ధం’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు. అలాగే ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో పలు తప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయని, వాటిని ఎవరూ నమ్మొద్దని చెప్పారు.