. 2 minutes
Team India: 18 ఏళ్ల కోహ్లీ ప్లాన్‌పై కన్నేసిన గంభీర్.. ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర సృష్టించేందుకు స్కెచ్

Team India: భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన తదుపరి లక్ష్యంపై దృష్టి సారించాడు. ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లాండ్‌ను టెస్ట్ సిరీస్‌లో ఓడించడంపైనే ఫోకస్ చేశాడు. ఇటీవలి ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత కూడా తాను ఒత్తిడిలోనే ఉంన్నానని గంభీర్ ఒప్పుకున్నాడు. జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు, ఈ సిరీస్ భారత క్రికెట్‌కు చాలా ముఖ్యమైనదని, తమ రిజర్వ్ బెంచ్‌ను పటిష్టం చేసుకోవాలని గంభీర్ పదే పదే నొక్కి చెబుతున్నాడు.

గంభీర్ దృష్టి ఇంగ్లాండ్‌పైనే..

భారత జట్టు 2007 తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్‌ను గెలవలేకపోయింది. ఈ దీర్ఘకాల నిరీక్షణకు ముగింపు పలకాలని గంభీర్ గట్టిగా సంకల్పించుకున్నారు. గత కొన్నేళ్లుగా టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని, స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో వైట్‌వాష్ అవ్వడం, ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటమిపాలు కావడం వంటి ఫలితాలు అభిమానులనే కాకుండా గంభీర్‌ను కూడా తీవ్రంగా బాధించాయి. అందుకే, సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ భారత్ తిరుగులేని శక్తిగా నిలబడాలని ఆయన భావిస్తున్నారు.

యువకులకు అవకాశం, ప్రణాళికాబద్ధమైన విధానం..

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు, గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారత యువ జట్టు ఇప్పటికే ఇంగ్లాండ్‌కు బయలుదేరింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్‌మెంట్ తర్వాత శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా తొలి టెస్ట్ సిరీస్ ఆడనుంది. గంభీర్ ఇండియా ‘ఏ’ జట్టుతో పాటు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి హెడ్ కోచ్‌గా ఆయన నిలిచారు. దీని ద్వారా యువ, ప్రతిభావంతులైన ఆటగాళ్లను దగ్గరగా పరిశీలించి, వారిని ప్రధాన జట్టులోకి తీసుకురావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.

“మేం ఒక మార్పు దశలో ఉన్నాం. వైట్ బాల్ క్రికెట్‌లో పెద్దగా సవాళ్లు లేనప్పటికీ, రెడ్ బాల్ క్రికెట్‌లో యువకులతో సహనంతో ఉండాలి. వారికి అభివృద్ధి చెందడానికి సమయం ఇవ్వాలి. రోజువారీ పరిశీలనలకు బదులుగా, వారికి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలి. తప్పులు చేయడం సహజం, కోచ్‌గా నా ప్రధాన బాధ్యత ఇదే” అని గంభీర్ అన్నారు.

కరుణ్ నాయర్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు కూడా ఈ సిరీస్‌లో అవకాశం కల్పించనున్నారు. కరుణ్ నాయర్ కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం, ఇటీవల ఇండియా ‘ఏ’ తరపున డబుల్ సెంచరీ సాధించడం భారత జట్టుకు ఎంతో ఉపయోగపడతాయని గంభీర్ అభిప్రాయపడ్డారు.

అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ..

ఈ సిరీస్ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే, ఇకపై ఇంగ్లాండ్-భారత్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌ను అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీగా పిలవనున్నారు. ఈ కొత్త పేరుతో, భారత జట్టు ఇంగ్లాండ్‌లో విజయం సాధించి చరిత్ర సృష్టించాలని గంభీర్ ఆశిస్తున్నారు.

గంభీర్ నాయకత్వంలో యువ భారత జట్టు ఇంగ్లాండ్ గడ్డపై ఎలాంటి ప్రదర్శన చేస్తుందో, 17 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ విజయాన్ని భారత్ సాధిస్తుందో లేదో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.