. < 1 minute

కొత్తగూడెం కార్పొరేషన్​లో డివిజన్ల లొల్లి!

Caption of Image.
  • అశాస్త్రీయంగా విభజించారంటూ కాంగ్రెస్​ లీడర్ల ఆగ్రహం
  • సీపీఐ నేతలు చెప్పినట్లు ఆఫీసర్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణ 
  •  విషయాన్ని ఇప్పటికే మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లిన స్థానిక నేతలు 
  •  మిగతా మంత్రులు, కలెక్టర్​కూ కంప్లైంట్​ ఇచ్చేందకు సిద్ధమవుతున్న నాయకులు 
  •  ముసాయిదా కాపీని నోటీస్​బోర్డులో ఒక్కరోజుకు మించి ఉంచలే.. 
  •  ఏ ఇల్లు ఏ డివిజన్​ లోకి వచ్చేదెలా తెలుసుకోవాలని స్థానికులు ఫైర్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం కార్పొరేషన్​లో డివిజన్ల లొల్లి రోజురోజుకూ ముదురుతోంది. డివిజన్ల ఏర్పాటు విషయమై స్థానికంగా అధికారంలో ఉన్న సీపీఐ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. డివిజన్ల విభజనలో ఆఫీసర్లు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్​ లీడర్లు ఫైర్​అవుతున్నారు. అశాస్త్రీయంగా డివిజన్లను ఏర్పాటు చేశారనిఆరోపిస్తున్నారు. అభ్యంతరాలు ఎక్కడ తీసుకుంటారు, ఎవరికి ఇవ్వాలి, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఇవ్వాలి అనే అంశాలపై కార్పొరేషన్​ అధికారులు ప్రచారం చేయకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

అంతా ఆ నేతల కనుసన్నల్లోనే..!

కార్పొరేషన్​ ఆఫీసర్లు సీపీఐ నేతలు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారని పలువురు కాంగ్రెస్​ నేతలు ఆరోపిస్తున్నారు. వార్డులలోని ఓటర్లను ఇష్టమున్నట్టుగా మార్చుతూ అంతా  సీపీఐ నేతల కనుసన్నల్లోనే జరిగిందంటూ ఆయా పార్టీల నాయకులు పేర్కొంటున్నారు. ఈ విషయమై శుక్రవారం పలువురు కాంగ్రెస్​ నేతలు మీటింగ్​పెట్టుకున్నారు. కొత్తగూడెం పట్టణంలోని కాంగ్రెస్​తో పాటు బీఆర్​ఎస్​ మాజీ కౌన్సిలర్ల వార్డులను అడ్డగోలుగా విభజించారని అంటున్నారు. కాగా, డివిజన్ల ఏర్పాటులో తమకు ఎటువంటి సంబంధం లేదని సీపీఐ నేతలు పేర్కొంటున్నారు. సీపీఐ, కాంగ్రెస్​ నేతల మధ్య సోషల్​మీడియాలో మాటల యుద్ధం 
కొనసాగుతోంది. 

మొత్తం గోప్యంగానే.. 

కొత్తగూడెం కార్పొరేషన్​లో 60డివిజన్లను ఏర్పాటు చేస్తూ ఈ నెల 4న ముసాయిదాను ఆఫీసర్లు రిలీజ్​ చేశారు. ముసాయిదా కాపీని కొత్తగూడెం కార్పొరేషన్ ఆఫీస్​లో ఏర్పాటు చేశారు. కానీ ఆ కాపీ నోటీస్​ బోర్డులో ఒక్కరోజుకు మించి పెట్టలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నోటీస్​ బోర్డులో డివిజన్​ కాపీలు లేకపోవడంతో ఏ డివిజన్​ పరిధి ఎక్కడి వరకు ఉంది, ఏ ఇంటి నెంబర్​ ఏ డివిజన్​ పరిధిలోకి వచ్చిందనే వివరాలు తమకు ఎలా తెలుస్తాయని ప్రజలు ఆఫీసర్ల తీరుపై మండిపడుతున్నారు. అలాగే డివిజన్లకు సంబంధించి అభ్యంతరాలను ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఇవ్వాలి, ఎక్కడ, ఎవరికి ఇవ్వాలి అనే విషయమై కార్పొరేషన్​ ఆఫీసర్లు కనీసం ప్రచారం చేయకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మంత్రులు, కలెక్టర్ ​దృష్టికి.. 

కార్పొరేషన్​లో డివిజన్ల ఏర్పాటుతో పాటు కమిషనర్​ వన్​ సైడ్​గా వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్​ పార్టీ నేతలు మంత్రులు, కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి పలువురు నేతలు కంప్లైంట్​ ఇచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, కలెక్టర్​కు కూడా ఫిర్యాదు చేస్తామని పలువురు నేతలు పేర్కొంటున్నారు. 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.