
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ అయింది. శుక్రవారం అమెరికాలోని ఇండియన్ ఎంబసీ ఈ వారెంట్ను విడుదల చేసింది. పాస్పోర్ట్ రద్దు కావడంతో ప్రభాకర్ రావు ట్రాన్సిట్ వారెంట్ కోసం దరఖాస్తు చేయగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇది జారీ అయ్యింది. ఈ పరిణామాలతో ప్రభాకర్ రావు శనివారం భారత్కు బయలుదేరి, జూన్ 8 అర్థరాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. వెంటనే జూన్ 9 ఉదయం ఆయన సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన సూత్రధారి అనే ఆరోపణల నేపథ్యంలో సిట్ అధికారులు ఆయనను విచారించనున్నారు.
అత్యధిక ట్రాఫిక్ రద్దీ కలిగిన టాప్ 10 నగరాలు ఇవే..!
బీఆర్ఎస్ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు, తమదే పార్టీకి చెందిన అసమ్మతి నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం చాలా రోజులు గోప్యంగా కొనసాగినప్పటికీ, 2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కేసు వెలుగులోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షలో ఈ విషయాన్ని ప్రస్తావించగా, వెంటనే సిట్ దర్యాప్తు ప్రారంభమైంది.
ఇప్పటికే పలువురు పోలీసు అధికారుల విచారణలో ప్రభాకర్ రావు పేరు ప్రముఖంగా వచ్చిందని సమాచారం. అయితే అప్పటికే ఆయన అమెరికాలో ఉండటంతో, అతన్ని భారత్కు రప్పించేందుకు సిట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి తనపై రాజకీయ కక్షతో కేసు పెట్టారని వాదించగా, కోర్టు ఆయన విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. పాస్పోర్ట్ రద్దు కావడంతో ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఆయన దేశానికి తిరిగి రానున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీసా జారీ అయిన తర్వాత మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆయనకు సూచించబడింది.
Mohandas Pai: కన్నడ భాషపై కొనసాగుతున్న వివాదం.. ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ సంచలన వ్యాఖ్యలు