. < 1 minute
AP DSC Teacher Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. ఇక ప్రతి ఏడాదీ డీఎస్సీ నోటిఫికేషన్‌: మంత్రి లోకేష్‌

అమరావతి, జూన్‌ 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ గుడ్‌న్యూస్ చెప్పారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు ఇకపై యేటా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఈ మేరకు శుక్రవారం (జూన్‌ 6) ఉండవల్లిలోని ఆయన నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, సమగ్ర శిక్షా అభియాన్‌లపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే చరిత్రలో తొలిసారి అత్యధికంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామన్నారు. డీఎస్సీ మొదటి రోజు పరీక్షలు ఎక్కడా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా ప్రశాంతంగా జరిగాయని అన్నారు. తొలిరోజు మొదటి విడతకు 88 శాతం, మధ్యాహ్నం విడతకు 86 శాతం మంది హాజరైనట్లు తెలిపారు. మిగతా పరీక్షలు కూడా సజావుగా జరిగేటట్లు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో మోడల్‌ విద్య తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని, ఉపాధ్యాయుల బదిలీలు సైతం పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు.

మంత్రి లోకేష్‌ ఇంకా ఈ విధంగా మాట్లాడారు. రాబోయే మూడేళ్లలో అక్షరాస్యతలో దేశంలోని మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ ఉండబోతుందని అన్నారు. వందశాతం అక్షరాస్యత సాధనే లక్ష్యంగా అక్షర ఆంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని త్వరలోన చేపడామన్నారు. ఇంకా రాష్ట్రంలో 15 నుంచి 59 ఏళ్ల వయసున్న వారిలో దాదాపు 81 లక్షల మంది నిరక్షరాస్యులుగా ఉన్నట్లు తెలిపారు. వయోజన విద్య కోసం ఇకపై మిషన్‌ మోడ్‌లో ప్రభుత్వం పనిచేయనున్నట్లు తెలిపారు.

ఉల్లాస్‌ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మార్చిలో 3.95 లక్షల మందికి అక్షరాస్యత పరీక్షలు నిర్వహించగా.. వారిలో 3.53 లక్షల మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. స్కిల యాప్‌ను ఉన్నతీకరించి, పోర్టల్‌లో అభ్యర్థుల నమోదు, శిక్షణ, సామర్థ్య పరీక్ష, సర్టిఫికేషన్‌తోపాటు ఉద్యోగ ఖాళీల వివరాలను పొందుపర్చాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి మంజూరైన 125 ఆటిజం కేంద్రాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని అన్నారు. నైపుణ్య శిక్షణ అందించి ఇప్పటి వరకు 77,703 మందికి ఉద్యోగాలు కల్పించిట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈఓ గణేష్‌కుమార్‌ మంత్రికి వివరించారు. నైపుణ్యం యాప్‌ ద్వారా 6,83,052 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 6,45,163 మందికి శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.https://tv9telugu.com/career-jobs

1552987,1553031,1553189,1552953

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.