. 2 minutes
Andhra: అయ్యగారు ఇంత అమాయకంగా కనిపిస్తున్నారు కదా..! అసలు యవ్వారం తెలిస్తే మీరు స్టన్ అంతే

అనకాపల్లి ప్రాంతానికి చెందిన ఆకోజు బ్రహ్మాజీ.. వ్యసనాలకు అలవాటు పడడంతో భార్య పిల్లలు దూరంగా పెట్టారు. దీంతో బ్రహ్మాజీ.. విశాఖ అల్లిపురానికి మకాం మార్చేశాడు. అక్కడ సింహాల దేవుడు వీధిలో ఓ ఇంట్లో నివాసం. కష్టపడి పనిచేయడనికి ఒళ్ళు వంచలేక.. ఈజీ మనీకి అలవాటు పడి.. దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. అదే కూడా  ఆలయాలను టార్గెట్ చేశాడు. భక్తుడులా అందరిలో కలిసిపోయి.. ఆ ఆలయాలపై రెక్కీ చేస్తాడు బ్రహ్మాజీ. అక్కడి అర్చకుడి వివరాలు తెలుసుకొని వారితో మాటలు కలుపుతాడు. భక్తుడి మాదిరిగా మాట్లాడుతూ.. మెల్లగా కూపీ లాగి ఆ ఆలయాన్ని గుల్ల చేసేస్తాడు.

అలా చేసి.. ప్లాన్..!

ఇక.. ఆలయంలో చోరీకి విచిత్ర వేషధారణ వేశాడు ఈ బ్రహ్మాజీ. చోరీల కోసం వేచి చూస్తున్న బ్రహ్మాజీకి విశాఖ వన్ టౌన్ వుడ్ యాడ్ స్ట్రీట్‌లోని దుర్గాలమ్మ ఆలయం ఎదుట ఒక బోర్డు కనిపించింది. అప్పటికే ఆలయంలో ఉన్న అర్చకుడికి వయసు మీద పడటంతో.. మరో అర్చకుడుని నియమించేందుకు నిర్వాహకులు నిర్ణయంచారు. దుర్గాలమ్మ అమ్మవారి ఆలయానికి పూజారి కావాలని నిర్వాహకులు బోర్డు పెట్టారు. అది బ్రహ్మాజీ కంట్లో పడింది.. దీంతో ఇక భలే ఛాన్స్‌లే అనుకున్న బ్రహ్మాజీ.. నిర్వాహకులను సంప్రదించాడు. మే 19న అక్కడకు వెళ్లి తాను బ్రాహ్మణుడేనని.. తనకు ఉద్యోగం అవసరమని అభ్యర్థించడంతో.. బ్రహ్మాజీని పూజారిగా నియమించారు. ఆలయానికి సంబంధించిన తాళాలు అప్పగించారు.

పూజ కోసం పూలు తెమ్మని..!

ఇక.. అదే రోజు ఆలయంలో లోపలికి వెళ్లిన బ్రహ్మాజీ పూజ కోసం పూలు, పళ్ళు తెమ్మని కోరాడు. దీంతో నిర్వాహకులు బయటకు వెళ్లడంతో.. ఇక  తన చేతికి పని చెప్పాడు. అప్పటికే తెచ్చుకున్న సంచిలో.. అమ్మవారి వెండి కిరీటం, హస్తం, చెవి ఆభరణాలతో పాటు వెండి వస్తువులు పట్టుకొని ఉడాయించాడు. దీంతో నిర్వాహకులు విషయాన్ని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు కోసం గాలించారు. ఎట్టకేలకు వన్ టౌన్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న బ్రహ్మాజీని కురుపాం మార్కెట్ వద్ద పట్టుకున్నామన్నారు క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు.

వామ్మో.. వాడి నేరాల చిట్టా..

అయితే.. అతన్ని పట్టుకొని తమదైన స్టైల్ లో విచారించిన పోలీసులకు.. స్టన్ అయ్యే విషయాలు తెలిశాయి. చోరీల చిట్టా పోలీసుల ముందు విప్పాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ఆలయాల్లో ఇప్పటివరకు చోరీలు చేసి తప్పించుకుని తిరుగుతున్నట్టు గుర్తించారు. విశాఖ వన్ టౌన్ లో 3 నేరాలతో పాటు మల్కాపురంలో రెండు, భీమిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మరో రెండు కేసులు, పెందుర్తి, కంచరపాలెం, చోడవరంలో ఒక్కో ఆలయంలో చోరీలు చేసినట్టు ఒప్పుకున్నాడు బ్రహ్మాజీ. బ్రహ్మాజీని అరెస్టు చేసిన పోలీసులు.. 2900 గ్రాముల వెండి, 7.6 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు.

కొన్ని ఆలయాల్లో భక్తుడిగా వెళ్లి రెక్కీ చేసి గుల్ల చేస్తే.. మరో చోట ఏకంగా పూజారిగా చేరి ఆలయంలో చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆకోజు బ్రహ్మాజీపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.