కాంగ్రెస్ పాలనలో అన్నీ
నిందలు, దందాలు, చందాలే
బిఆర్ఎస్ మీద నిందలు,
బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు,
రాహుల్ గాంధీకి చందాలు..
ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్,
బిజెపి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బిజెపి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కెటిఆర్ సహా మాజీ మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలన్న తన విజ్ఞప్తి మేరకు హరీష్రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారని తెలిపారు. తాము నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం చేశారని చేస్తే రాష్ట్రంలో ప్రస్తుతం నిందలు, దందాలు, చందాలు.. అనే విధానం కొనసాగుతోందని విమర్శించారు. బిఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు.. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని అని ఆరోపించారు.
కాళేశ్వరంలో ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వస్తే దాన్ని పట్టుకొని దున్నపోతు ఈనిందని కాంగ్రెస్ వాళ్లు అంటే.. దాన్ని పట్టుకొని దుడ్డెని కట్టేయమని బిజెపి వాళ్లు అంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమానికి శీర్షిక నీళ్లు, నిధులు, నియామకాలు అని, అందుకే పదేండ్ల కెసిఆర్ ప్రభుత్వం ఈ మూడు రంగాల్లో సంపూర్ణమైన న్యాయం చేసిందని తెలిపారు. నీళ్ల విషయంలో కృష్ణా, గోదావరిలో ప్రతినీటి బొట్టును ఒడిసిపట్టి చుక్క నీటిని వదలకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కాలంతో పోటీపడి కట్టినా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని దాదాపు 90 శాతం పూర్తిచేసినా, సీతారామ ప్రాజెక్టును కూడా 90 శాతం పూర్తిచేసి తెలంగాణ రైతాంగం ప్రయోజనం కోసం కెసిఆర్ సర్కార్ నిరంతరం పనిచేసిందని చెప్పారు. గుజరాత్లో మార్బీ అనే ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జి కూలి పోయి 140 మంది చనిపోయినా ఎన్డిఎస్ఎ గానీ, మరో ఏజెన్సీ గానీ వెళ్లలేదని మండిపడ్డారు. 140 మంది చావులకు ఫలానావాడు బాధ్యుడని ఏ ఏజెన్సీ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ మాట్లాడదు అని, బీహార్లో నాలుగు రోజులకి ఒక బ్రిడ్జి కూలిపోతున్నా అడిగే నాథుడు లేదని అగ్రహం వ్యక్తం చేశారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి రూ.100 కోట్లు నష్టం జరిగితే ఎన్డిఎస్ఎ రాలేదని,
అలానే అవినీతి, కమీషన్ల కక్కుర్తితో ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలిపోయి 8 మంది చనిపోయినా.. ప్రమాదం జరిగి 100 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కేంద్రంలో ఉండే ఒక్క మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడరు అని విమర్శించారు. అలాగే వట్టెం పంప్ హౌస్ మునిగిపోతే దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరని, పెద్ద వాగు ప్రాజెక్ట్ రెండు సార్లు కొట్టుకు పోయినా అడిగేవాడు లేరని పేర్కొన్నారు. కానీ కాళేశ్వరంలో 100 కాంపోనెంట్లు ఉంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వస్తే బిజెపి వాళ్లు రెండు రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్టును వారి పార్టీ ఆఫీసులో తయారు చేసి ప్రజలను భ్రమింపచేసే ప్రయత్నం చేశారని అన్నారు. దానికి తిరుగులేని విధంగా ఎల్ అండ్ టీ సంస్థ ఎన్డీఎస్ఏ నివేదికను తిరస్కరిస్తున్నామని స్పష్టం చెప్పిందని చెప్పారు. ఆ రిపోర్టు చెత్తబుట్టలో పడేయడానికి తప్ప ఎందుకు పనికిరాదని ఎల్ అండ్ టి సంస్థ చెప్పిందని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీని కట్టిన సంస్థ పనికిరానిదైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అదే సంస్థతో ఎందుకు కట్టించారని సిఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యాలయాన్ని కూడా తెలంగాణ నుంచి పోయిన మూటలతో కట్టారని ఆరోపించారు.
కాంగ్రెస్, బిజెపి పార్టీలు కుమ్మక్కై కెసిఆర్పై అభాండాలు వేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ పేరిట రేవంత్ ప్రభుత్వం నాటకాలాడుతోందని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్కు వెంటనే రిపేర్లు చేసి నీళ్లివ్వాలని తాము గతంలో కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు ఏనాటికైనా కెసిఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ -బిజెపి కలిసి తెలంగాణ రైతుల బొండిగె పిసికే కుట్ర చేస్తున్న నేపథ్యంలో జిల్లాల వరకూ వెళ్లి వాస్తవాలు చెబుతామని తెలిపారు. మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మత్తు చేసి రైతులకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా.. కుంటిసాకులతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.