
- రెండు సార్లు ఓడినా పట్టువదలని కవ్వంపల్లి
మానకొండూర్, వెలుగు: వైద్య వృత్తినుంచి రాజకీయాల్లోకి వచ్చిన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను మంత్రి పదవి వరించింది. ప్రజారాజ్యం, టీడీపీ నుంచి పోటీచేసి రెండుసార్లు ఓడినా.. నియోజకవర్గ ప్రజల సేవలోనే మునిగిన ఆయన మూడోసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలిచిన మొదటిసారే మినిస్టర్ పదవిని పొందారు.
సత్యనారాయణది మానకొండూర్ మండలం పచ్చునూరు. పోచమ్మ, -ఎల్లయ్య దంపతులకు 1967 జూన్ 10న జన్మించారు. కరీంనగర్ లో విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఎంబీబీఎస్ (ఎంఎస్) జనరల్ సర్జన్గా వైద్యవృత్తిని కొనసాగించారు. డాక్టర్గా తొలినాళ్లలో స్వగ్రామంలో ఉచిత వైద్య సేవలు అందించారు. ఆ తర్వాత తన భార్యతో కలిసి మండల, నియోజకవర్గ స్థాయిలో ఉచిత వైద్య సేవలను విస్తృతం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రజలకు సేవచేసేందుకు..
ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఎక్కువ మేలు చేయవచ్చని డాక్టర్ కవ్వంపల్లి రాజకీయ రంగాన్ని ఎంచుకున్నారు. మొదట తిమ్మాపూర్ జడ్పీటీసీ గా పోటీ చేసి గెలుపొందారు. 2009లో మానకొండూర్ ఎస్సీ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మానకొండూర్ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
టీడీపీలో ప్రస్తుత సీఎం రేవంత్తో కలిసి పనిచేసిన డాక్టర్ సత్యనారాయణ.. 2017 వరకు టీడీపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా, టీడీపీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా పలు పదవులు నిర్వహించారు. 2020 నుంచి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2023 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మానకొండూర్ నుంచి మూడో ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ టికెట్పై పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచీ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారు.