
- జూన్ 8న మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట మధ్య ప్రమాణం
- కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ ఓకే
- ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్
- ప్రమాణ స్వీకారం కోసం రాజ్భవన్లో ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య మంత్రులుగా ముగ్గురు ప్రమాణం చేయనున్నారు. ఇందులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉన్నారు. వీరి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ శనివారం రాత్రి ఖరారు చేసింది. ముగ్గురితో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రులుగా ప్రమాణం చేయించనున్నారు. ఈ మేరకు రాజ్భవన్ వర్గాలు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. మంత్రివర్గంలో పేర్లు ఉన్నవారికి ఆదివారం ఉదయంలోపు సీఎంవో నుంచి ఫోన్ ద్వారా సమాచారం వెళ్లనుంది.
మరో మూడు పెండింగ్
రాష్ట్ర కేబినెట్లో మొత్తం ఆరు బెర్తులు ఖాళీగా ఉండగా.. ప్రస్తుతం మూడు బెర్త్లను భర్తీ చేయనున్నారు. ఆదివారం మృగశిర కార్తె కావడం, మంచి ముహూర్తం ఉండడంతో కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగిలిన మూడు బెర్త్లను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో ఉన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో శనివారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడినట్టు తెలిసింది.
శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గవర్నర్ హైదరాబాద్కు బయలుదేరారు. ప్రస్తుతం భర్తీ చేయనున్న మూడు మంత్రి పదవుల్లో ఎస్సీ మాల (వివేక్ వెంకటస్వామి), ఎస్సీ మాదిగ (కవ్వంపల్లి సత్యనారాయణ), బీసీ ముదిరాజ్ (వాకిటి శ్రీహరి)కు దక్కాయి. కాగా.. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి తో ఆయన నివాసంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమై.. కేబినెట్ విస్తరణపై చర్చించారు. అనంతరం విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు తెలియజేశారు. ఆ తర్వాత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే , అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించారు.