
అప్పటికే ఒకర్ని ప్రేమించడం ఆ విషయం తెలియక ఇంట్లో వాళ్లు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించడం.. ఆ పెళ్లి ఇష్టం లేక ప్రియుడితో లేదా ప్రియురాలితో వెళ్లిపోవడం.. ఈ తరహా ఘటనలు ఎక్కువైపోయాయి. పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తల్లిదండ్రులకు ఆర్థిక కష్టాలు, అవమాన బారాలు మిగుల్చుతున్నారు కొంతమంది యువతీయువకులు. తాజాగా ఓ యువతి తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని తన అన్న ఫ్రెండ్ తో వెళ్లిపోయింది. ఈ విషయంపై ఆ యువతి తండ్రికి అన్నకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తండ్రిని కొట్టి చంపాడు కొడుకు ఈ విషాద ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది.
Also Read:Colombia: కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు..
కోహిర్ (మం) నాగిరెడ్డిపల్లిలో దారుణం వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో తండ్రిని కొట్టి చంపాడు కొడుకు. గత నెల16న కుమార్తెకు పెళ్లి నిశ్చయించారు. అయితే ఆ పెళ్లి యువతికి ఇష్టం లేదు. దీంతో పెద్ద కుమారుడి స్నేహితుడితో కూతురు వెళ్ళిపోయింది. తన పరువు పోయిందని గత కొన్ని రోజులుగా పెద్ద కుమారుడు మహేష్, తండ్రి మొగులయ్య మధ్య వాగ్వాదం జరుగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి కూడా తండ్రికొడుకులు గోడవపడ్డారు. ఆగ్రహంతో మద్యం మత్తులో కుమారుడు మహేష్ తన తండ్రిని ఇనుపరాడ్ తో కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందాడు. కూతురు కారణంగా తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.