. 2 minutes

కాళేశ్వరం ప్రాజెక్టుకు నాటి కేబినెట్ ఆమోదం లేదు: తుమ్మల నాగేశ్వర్ రావు

Caption of Image.

 

  • సబ్​ కమిటీ ముందుకు కాళేశ్వరం ప్రాజెక్టుప్రతిపాదనే రాలేదు: మంత్రి తుమ్మల
  • కేబినెట్ సబ్ కమిటీకి, కాళేశ్వరానికి సంబంధం లేదు 
  • మేడిగడ్డ అనుమతుల తర్వాతే కమిటీ వేశారు
  • ప్రాణహితపై మాత్రమే స్టేటస్ రిపోర్ట్ ఇచ్చాం
  • కమిషన్ ముందు ఈటల అబద్ధాలు చెప్పారు
  • కాళేశ్వరం కమిషన్​కు కేబినెట్​ సబ్ కమిటీ వివరాలందిస్త
  • ఈ వివాదంలోకి తనను అనవసరంగా లాగుతున్నారని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: నాడు తాను చైర్మన్‌‌గా ఉన్న కేబినెట్ సబ్ కమిటీకి, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు తెలిపారు.  ‘‘కేబినెట్​ సబ్ కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టుపై రిపోర్ట్​ ఇవ్వలేదు.. కేవలం ప్రాణహిత ప్రాజెక్టుపై మాత్రమే స్టేటస్ రిపోర్ట్ సమర్పించాం.. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లేదు.. అసలు మంత్రివర్గం ముందుకు ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలే రాలేదు.. పరిపాలన అనుమతులతోనే అమలులోకి వచ్చింది’’ అని పేర్కొన్నారు.

కాళేశ్వరం నిర్మాణానికి సబ్ కమిటీ అనుమతి ఇచ్చిందని ఈటల చెప్పడం పూర్తి అసత్యమని, ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. పైగా కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలోకి తనను అనవసరంగా లాగుతున్నారని  తుమ్మల నాగేశ్వరరావు  అసహనం వ్యక్తం చేశారు.  ఈ మేరకు శనివారం సెక్రటేరియెట్‌‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడారు.  ‘‘కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన అనాలోచితంగా వాంగ్మూలం ఇచ్చారా? లేదంటే అలాంటి పరిస్థితులు కల్పించారా? అనేది అర్థం కావడంలేదు” అని అన్నారు. తప్పుడు ప్రకటనలతో ప్రజలను ఎంతో కాలం మభ్యపెట్టలేరని వ్యాఖ్యానించారు.‘‘మేడిగడ్డ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన తర్వాతే కమిటీ ఏర్పాటు చేశారు. వాస్తవం ఇదైతే  సబ్​ కమిటీకీ, కాళేశ్వరానికి లంకెపెట్టి  తుమ్మల నాగేశ్వరరావు కూడా సంతకం పెట్టారని ఈటల మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. రాజకీయాలు వేరు, రాష్ట్ర అభివృద్ధి వేరు.  కేటగారికల్​గా ఏం జరిగిందో డేట్​తో సహా వెల్లడిస్తా. దీనిలో నాకు సంబంధం లేదు. ఈటల రాజేందర్​ పొంతనలేని ప్రకటనలతో ఇంకా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నరు’’ అని తుమ్మల పేర్కొన్నారు. ఈటల వాంగ్మూలం వల్ల ప్రజల్లోకి  తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని, అందువల్ల తాను మీడియా సమావేశం ద్వారా క్లారిఫికేషన్​ ఇస్తున్నానని చెప్పారు. 

పూర్తి వివరాలను కమిషన్​కు అందజేస్తా..

తన 43 ఏండ్ల రాజకీయ జీవితంలో నిబద్ధత, నిజాయతీతో పనిచేశానని, తెలిసి ఎక్కడా పొరపాటు చేయలేదని తుమ్మల నాగేశ్వర్​రావు అన్నారు. ఈటల రాజేందర్ పొంతనలేని ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం విషయంలో పూర్తి వివరాలను స్వయంగా (సుమోటోగా) కమిషన్‌‌కు అందిస్తానని చెప్పారు.  బీఆర్ఎస్​ సర్కారు కాళేశ్వరంపై కేబినెట్​సబ్​కమిటీ వేయలేదని, కాళేశ్వరం మినహా ప్రాణహిత, దేవాదుల, కాంతనపల్లి, తుపాకులగూడెం వంటి పెండింగ్ ప్రాజెక్టులపై వేసిందని చెప్పారు.  ఆ పెండింగ్​ వర్క్స్​పూర్తికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై తాము సూచనలు, సలహాలు ఇచ్చామన్నారు.  ప్రాజెక్టుల ఎస్టిమేట్​ రేట్లకు  కాంట్రాక్టర్లు పనులు చేస్తారా? లేదంటే ప్రభుత్వం ఎలా ముందుకెళ్లి? అనేది చెప్పామన్నారు. 

దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ ముందుకు ఎప్పుడూ రాలేదని, ఒకవేళ వస్తే అందుకు రుజువు చూపాలని ఈటల రాజేందర్‌‌ను తుమ్మల డిమాండ్ చేశారు. తాను ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదని, రాష్ట్ర అభివృద్ధి కోసం నిజాయతీగా సలహాలు, సూచనలు ఇచ్చానని స్పష్టం చేశారు. ఏడాదిన్నర కాలంలో అధికారంలోకి వచ్చిన  కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే కుట్రలో భాగంగా తనను కాళేశ్వరం వివాదంలోకి లాగుతున్నారని, ప్రతిపక్షాలు ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. ‘‘కాళేశ్వరం పనులేవీ కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో జరిగినవి కాదు..  బీఆర్ఎస్​ హయాంలోనే  శాంక్షన్స్​ ఇచ్చారు.. వారే ఎస్టిమేట్స్​వేశారు. వారే రివైజ్​డ్​చేశారు. వారి హయాంలోనే పనులు చేశారు. వారి హయాంలోనే కుంగిపోయింది. ఆ కాళేశ్వరం పథకం నిరుపయోగమని  ఎన్డీఎస్​యే కూడా గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలోనే చెప్పింది’’ అని తుమ్మల వెల్లడించారు.
 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.