
హైదరాబాద్, జూన్ 8: బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం (జూన్ 8) ఉదయం 5.45 గంటలకు గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని మాదాపూర్లోని ఆయన నివాసానికి తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్లో మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన మాగంటి 1963 జూన్ 2వ తేదీన హైదరాబాద్ హైదర్గూడలో జన్మించారు. తల్లి మహానందకుమారి, తండ్రి కృష్ణమూర్తి. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశారు.
1983లో టీడీపీ తరఫున రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా 1987,1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (HUD) డైరెక్టర్గా పనిచేశారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్పై 9242 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెలుగు దేశం పార్టీలో మాగంటి చురుగ్గా అనేక హోదాల్లో పని చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్లో చేరారు. అనంతరం వరుసగా 2018, 2022లో బీఆర్ఎస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత. వారికి ముగ్గురు సంతానం.
సినీ నిర్మాతగా మాగంటి..
మాగంటి గోపీనాథ్ రాజకీయాల్లోకి రాకముందు సినీ నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కించారు. రవన్న (2000), ప్రాణం (2003), భద్రాద్రి రాముడు (2004), నా స్టైలే వేరు (2009) వంటి చిత్రాలకు మాగంటి నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ మువీలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోవడంతో రాజకీయల్లోకి వచ్చారు. అలా 2014 నుంచి 2025 వరకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి తిరుగులేని చక్రం తిప్పారు. మాగంటికి ముందు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నేత పీ జనార్దన్ రెడ్డి కుమారుడు పి విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. మాగంటి గోపీనాథ్కు భార్య సునీత, కొడుకు వాత్సల్యనాథ్, కూతుళ్ళు దివ్య అక్షరనాగ్, దిశిర ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.