భారతదేశంలో సందర్శించడానికి చాలా ఉన్నాయి. మీకు ప్రయాణించడం ఇష్టమైతే.. పర్వతాల నుంచి బీచ్ల వరకు ప్రతి ప్రదేశం అన్వేషించడానికి ఉత్తమమైనది. అయితే అందమైన బీచ్ల కోసం ఒక ప్రత్యేక దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారని మీకు తెలుసా.. ఇది ప్రపంచ మహాసముద్ర దినోత్సవం. దీనిని ప్రతి సంవత్సరం జూన్ 8న జరుపుకుంటారు. ఈ రోజు మన దైనందిన జీవితంలో మహాసముద్రాలు ఎంత పెద్ద పాత్ర పోషిస్తాయో మనకు గుర్తు చేస్తుంది. సముద్రాలు.. భూమికి ఊపిరితిత్తుల వంటివి, ఆహారం, ఔషధాలకు ప్రధాన వనరులు.
మహాసముద్రాలు నీటి వనరు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆహారం, పోషణను కూడా అందిస్తున్నాయి. కనుక అవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తాయి. చాలా మంది ప్రజల జీవనోపాధి సముద్రాలపై ఆధారపడి ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ వంటి పర్యావరణ సమస్యలు సముద్రానికి.. సముద్రంలో నివసించే జీవులకు ముప్పు కలిగిస్తున్నాయి. ఈ దృష్ట్యా ఈ దినోత్సవాన్ని జరుపుకునే విషయంలో మరింత ప్రాముఖ్యత పెరిగింది.
ప్రపంచ మహాసముద్ర దినోత్సవం ఎలా ప్రారంభమైందంటే.. 1992లో జరిగిన ఎర్త్ సమ్మిట్లో.. కెనడాలోని ఓషన్స్ ఇన్స్టిట్యూట్, కెనడాలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించాయి. ఆ తర్వాత 2008 నుంచి ప్రపంచ మహా సముద్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం సముద్రాలను కాపాడటమే. మన దేశంలో అత్యంత పరిశుభ్రమైన బీచ్ లున్నాయి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
శివరాజ్పూర్ బీచ్, గుజరాత్: గుజరాత్ లోని ద్వారకలో ఉన్న శివరాజ్పూర్ బీచ్ నిజంగా చాలా శుభ్రంగా , అందంగా ఉంటుంది. బీచ్లో ఉన్న నీలిరంగు నీరు , శుభ్రమైన ఇసుక ఈ ప్రదేశం అందాన్ని మరింత పెంచుతాయి. తాగునీరు, ప్రథమ చికిత్స సౌకర్యం, టాయిలెట్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా తమ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో ఇక్కడికి వెళ్లేందుకు ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. కొన్ని చిరస్మరణీయ క్షణాలను గడపవచ్చు.
పడుబిద్రి బీచ్, కర్ణాటక: పాడుబిద్రి బీచ్ కర్ణాటకలో ఉడిపి జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ సముద్ర తీరం. ఇక్కడి నీలిరంగు నీరు, తెల్లటి ఇసుక ఈ ప్రదేశాన్ని మరింత అందంగా కనువిందు చేస్తాయి. ఇది బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన బీచ్లలో ఒకటి. ఇది పర్యావరణ అనుకూలమైనది.పర్యాటకులకు సురక్షితమైన ప్రదేశం కనుక ఈ బీచ్ పర్యటించేందుకు ఆకర్షితులవుతారు. రోజంతా ఇక్కడ సముద్రాన్ని ఆస్వాదిస్తూ గడపవచ్చు.
సున్హారా బీచ్ లేదా గోల్డెన్ బీచ్, ఒడిశా: ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఒడిశాలోని గోల్డెన్ బీచ్ను ఖచ్చితంగా సందర్శిస్తారు. ఈ ప్రదేశం అందం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఇక్కడికి వచ్చే ప్రజలకు అవసరమైన చాలా మంచి సౌకర్యాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ బీచ్లో పర్యాటకులు ప్రశాంతంగా గడపవచ్చు. ఈ బీచ్లో ఒంటె సవారీ, గుర్రపు స్వారీ వంటివి, ఇంకా ఇతర ఆటవస్తువులు ఉన్నాయి.
కప్పడ్ బీచ్, కేరళ: కేరళలోని కప్పడ్ బీచ్కి ఒక చరిత్ర కథ ఉంది. దీనిని కప్పకడవు అని కూడా పిలుస్తారు. ఈ బీచ్ చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. వాస్కో డ గామా 1498 లో ఈ బీచ్ లో మొదటగా అడుగు పెట్టాడు. ఈ బీచ్ వలస పక్షులు మరియు అద్భుతమైన రాళ్లకు ప్రసిద్ధి చెందింది. ఇది చాలా అందమైన, శుభ్రమైన బీచ్.
రుషికొండ బీచ్, ఆంధ్రప్రదేశ్: రుషికొండ బీచ్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరం నుంచి 8 కి.మీ దూరంలో ఉన్న చాలా అందమైన, శుభ్రమైన బీచ్. ఇక్కడి పచ్చదనం , అందమైన శిఖరాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. పారాసెయిలింగ్, జెట్ స్కీయింగ్, విండ్ సర్ఫింగ్ , బోట్ రైడ్ వంటి కార్యకలాపాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా తమ కుటుంబం లేదా భాగస్వామితో ఈ బీచ్ లో ఎంజాయ్ చేయడం మధురమైన జ్ఞాపకంగా మారుతుంది.