కాళేశ్వరంపై మీరు చేస్తున్నది దుష్ప్రచారం అని పూర్తి ఆధారాలతో బట్టబయలు చేసినా కూడా మళ్లీ అవే అబద్దాలు చెబుతున్నారని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి హరీష్రావు వ్యాఖ్యానించారు. ఉత్తమ్కుమార్రెడ్డిలాగా ప్రిపేర్ కాకుండా వచ్చే అలవాటు తమకు లేదు అని, పూర్తి ఆధారాలతో సహా తాను ఇచ్చిన ప్రజెంటేషన్లో అన్ని వాస్తవాలు వెల్లడించానని పేర్కొన్నారు. ఐదేళ్లలో మేడిగడ్డలో ఎత్తిపోసిన నీళ్లు 162 టిఎంసిలే అని చెబుతున్న మంత్రి ఉత్తమ్ కాళేశ్వరంలో భాగమైన ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కు లిఫ్ట్ చేసింది ఎందుకు చెప్పరు..? అని ప్రశ్నించారు. లక్ష్మి పంప్ హౌజ్, సరస్వతి పంప్ హౌజ్, పార్వతి పంప్ హౌజ్, నంది పంప్ హౌజ్, గాయత్రి పంప్ హౌజ్ నుంచి ఎత్తిపోసిన నీళ్ల గురించి ఎందుకు దాస్తారని అడిగారు. కాళేశ్వరం కట్టిన మూడు ఏళ్లలోనే అంటే 2022 -23 వరకే మేడిగడ్డ నుంచి 162.41 టిఎంసిలు, అన్నారం నుంచి 172.86 టిఎంసిలు, సుందిళ్ల నుంచి 172.12 టిఎంసిలు, నంది మేడారం పంప్ హౌజ్ నుంచి 181.70 టిఎంసిలు, గాయత్రి పంప్ హౌజ్ నుంచి 179.41 టిఎంసిల గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తి పోశామని, ఇది వాస్తవం అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మంత్రి ఉత్తమ్కు తెలియకుంటే ఇంజినీర్లను అడిగి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఇరిగేషన్ మంత్రిగా ఉంటూ ఎందుకు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. ఏ ప్రాజెక్టు నిర్మించినా మొదటి దశలోనే పూర్తి ఆయకట్టుకు నీరు అందించడం సాధ్యపడదు అనే విషయం అందరికీ తెలిసిందే అని, కాల్వలు తవ్వుతున్నా కొద్దీ నీరు అందే ఆయకట్టు పెరుగుతుందని తెలిపారు. 9 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా 1963లో ప్రారంభించిన ఎస్సారెస్పీ పనులు 1975 నాటికి పూర్తి కాగా, 11 ఏళ్ల తర్వాత మొదటగా వచ్చిన ఆయకట్టు 25 వేల ఎకరాలు మాత్రమే అని చెప్పారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1955 శంకుస్థాపన చేస్తే 1966లో పూర్తి చేశారని, 12 సంవత్సరాల తర్వాత ఎడమ కాల్వ ద్వారా 5 లక్షల ఎకరాల లక్షానికి గాను మొదట్లో వచ్చిన ఆయకట్టు 98,842 ఎకరాలు మాత్రమే అని వివరించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కట్టిన కల్వకుర్తి ప్రాజెక్టు 1984లో ప్రారంభమై 2014 నాటికి ఇచ్చిన ఆయకట్టు 3 లక్షల 30వేల ఎకరాలకు గాను మొదట్లో ఇచ్చింది 13వేల ఎకరాలు మాత్రమే అని,
2001లో మొదలు పెట్టిన దేవాదుల ప్రాజెక్టు ద్వారా 2014 నాటికి ఆరు లక్షల ఎకరాలకు గాను ఇచ్చింది 45వేల ఎకరాలు మాత్రమే అని పేర్కొన్నారు. ఏ ప్రాజెక్టు చూసినా ఇదే పరిస్థితి ఉంటుందని, ఏ ప్రాజెక్టులో అయినా హెడ్ వర్క్ మొదలు పూర్తి చేసి టెయిల్ వరక్స్ తర్వాత పూర్తి చేస్తుంటారని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కమిషన్ల కోసం తోక పనులు మొదలు పెట్టి, హెడ్ వర్క్ వదిలి పెట్టారని, ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందని విమర్శించారు. ఇకకైనా తలా తోక లేని మాటలు మాట్లాడటం మానేయాలని, అబద్దాలు ప్రచారం చేయడం విరమించుకోవాలని సూచించారు.