తెలంగాణ రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో సుమారుగా నాలుగో వంతు అసెంబ్లీ స్థానాలు ఉన్న గ్రేటర్ హైదరాబాద్కు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేకపోవడం సర్వత్రా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాష్ట్రప్రభుత్వంలో కీలకభూమిక పోషించాల్సిన రాజధానిలో ఒక్కరికి కూడా మంత్రివర్గంలో చోటులేకపోవడం ఇటు కాంగ్రెస్ పార్టీలోను.. అటు గ్రేటర్లోనూ గందరగోళ పరిస్థితి నెలకొంటున్నది. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా ఇప్పటివరకు గ్రేటర్ నుంచి మంత్రివర్గంలోకి ఒక్కరిని కూడా తీసుకోకపోవడం గమనార్హం. కెసిఆర్ నాయకత్వంలోని ప్రభుత్వంలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఏకంగా నలుగురికి మంత్రివర్గంలో అవకాశం కల్పించిన విషయమూ తెలిసిందే.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాలనుంచి మంత్రివర్గంలో అవకాశమిచ్చినా హైదరాబాద్ నుంచి ఎవరికీ అవకాశం ఇవ్వకపోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనా.. గ్రేటర్ నుంచి కాంగ్రెస్ తరపున ఎవరూ గెలవకపోవడంతోనే అవకాశం రాలేదన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. అయితే, రాజధాని అభివృద్ధి దృష్టా ఎవరికైనా ఇవ్వాల్సిన అవకాశం (ఎంఎల్సిలకు) ఉన్నా మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వకపోవడం రేవంత్ రెడ్డి సర్కారుకు లోటుగా మారింది. కోటి మంది జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒక్కరు కూడా మంత్రివర్గంలో లేకపోవడం రాజధాని చిన్నబోతుంది.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రులు నందమూరి తారకరామారావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కె.రోశయ్య, ఎన్. కిరణ్కుమార్ రెడ్డి, తెలంగాణ ఏర్పడిన తరువాత కెసిఆర్ మంత్రివర్గంలో రాజధాని నగరానికి ప్రత్యేక స్థానం కల్పించి హైదరాబాద్కు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014లో కెసిఆర్ నాయకత్వలో అప్పటి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా.. గ్రేటర్లో సికింద్రాబాద్ నుంచి టి. పద్మారావు ఒక్కరే విజయం సాధించినా.. మంత్రివర్గంలో పెద్దపీఠ వేశారు. పద్మారావుతోపాటు టిఆర్ఎస్ సీనియర్ నేతలు నాయిని నర్మింహ్మారెడ్డి, మహమూద్ అలీ (ఎంఎల్సిలుగా అవకాశమిచ్చి), సనత్నగర్ నుంచి టిడిపి తరపున గెలిచిన తలసాని శ్రీనివాస్యాదవ్ (టిఆర్ఎస్లో చేర్చుకుని)కు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారు. 2018లో రెండవ పర్యాయం టిఆర్ఎస్ (ప్రస్తుత బిఆర్ఎస్) అధికారంలోకి రావడంతో కెసిఆర్ మంత్రివర్గంలో తలసాని, మహమూద్ అలీలకు మంత్రివర్గంలో చోటు కల్పించి, పద్మారావును డిప్యూటీ స్పీకర్గా అవకాశమిచ్చారు.
అనంతరం కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ చేరిన మహేశ్వరం ఎంఎల్ఎ పి. సబితా ఇంద్రారెడ్డికి కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో హైదరాబాద్ నుంచి ఖైరతాబాద్ ఎంఎల్ఎగా గెలుపొందిన విజయరామారావుతో పాటు తలసాని శ్రీనివాస్యాదవ్ (సికింద్రాబాద్), కృష్ణాయాదవ్ (హిమాయత్నగర్)లకు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. 2004లో వైఎస్ నాయకత్వంలో ఏర్పడిన కూటమి సర్కారులోనూ హైదరాబాద్ నుంచి నాయిని నర్సింహ్మారెడ్డి (ముషీరాబాద్), ముఖేష్గౌడ్ (మహారాజ్గంజ్)లకు, 2009లో రెండవ పర్యాయం వచ్చిన కాంగ్రెస్ సర్కారులోనూ నగరం నుంచి దానం నాగేందర్ (ఖైరతాబాద్), ముఖేష్గౌడ్ (గోషామహల్)లకు ప్రాతినిధ్యం కల్పించారు.
అంతేకాదు గ్రేటర్ పరిధిలోని మహేశ్వరం నుంచి గెలుపొందిన పి. సబితా ఇంద్రారెడ్డికి కీలకమైన హోంశాఖను కట్టబెట్టిన విషయం తెలిసిందే. ప్రతి ప్రభుత్వంలో రాజధాని నగరానికి పెద్దపీఠ వేస్తూ నగరంనుంచి ఒకరిద్దరికీ అవకాశం ఇచ్చినా ప్రస్తుత రేవంత్రెడ్డి సర్కారులో ఒక్కరికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం పార్టీ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. 2023లో జరిగిన ఎన్నికల్లో గ్రేటర్నుంచి కాంగ్రెస్ ఎంఎల్ఎలుగా విజయం సాధించకపోయినా.. కీలక నేతలను ఎంఎల్సిలుగా చేసి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని భావించినా నిరాశగానే మిగిలింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రేటర్ పరిధిలోని రాజేంద్రనగర్ ఎంఎల్ఎ ప్రకాష్గౌడ్, ఖైరతాబాద్ ఎంఎల్ఎ దానం నాగేందర్, శేరిలింగంపల్లి ఎంఎల్ఎ అరికెపూడి గాంధీ, పటాన్చెరు ఎంఎల్ఎ మహిపాల్రెడ్డిలు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం.
వాస్తవానికి మంత్రి పదవి ఇస్తామన్న హామీతోనే ఒకరిద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా రాజధాని నగరంలో పార్టీ బలహీనంగా ఉంది. పార్టీ పటిష్టతపై కాంగ్రెస్ దృష్టిని కూడా సారించడంలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలోని కీలక నేతలు వర్గాలుగా విడిపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణమని పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే గ్రేటర్ పరిధి నుంచి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నా.. రాజకీయ, కుల, వర్గాల సమీకరణాల దృష్టా ఎంతవరకు సాధ్యమవుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రివర్గ విస్తరణ చేపడితే తమకు అవకాశం ఉంటుందని నేతలు ఎవరికి వారే తమ అనుచరులకు చెప్పుకుంటున్నట్లు తెలిసింది. దానం నాగేందర్, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రకాష్గౌడ్, శ్రీగణేష్లతో పాటు కొందరు సీనియర్ నేతలూ మంత్రిపదవుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే, మంత్రిపదవి ఇవ్వకపోతే తమదారి తాము చూసుకుంటామని కొందరు నేతలు అధిష్టానానికి అల్టిమేటం కూడా ఇచ్చినట్లు తెలిసింది. ఏదిఏమైనా గ్రేటర్ హైదరాబాద్ నుంచి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నేతలతోపాటు గ్రేటర్వాసులూ కోరుతున్నారు. గ్రేటర్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని.. ఇది పార్టీ పటిష్టతకూ ఎంతో దోహదపడుతుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. త్వరలో చేనట్టబోయే మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్ నుంచి ఒకరిద్దరికి అవకాశం కల్పించి, గ్రేటర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని గ్రేటర్వాసులు విన్నవిస్తున్నారు.
ఎం.వి. శివశంకర్,
(సిటీబ్యూరో ప్రతినిధి)
(93953 45694)