. 2 minutes

పాక్ పాలకులకు నిద్రలేకుండా చేసినం: ప్రధాని మోదీ

Caption of Image.
  • ఆపరేషన్​ సిందూర్​తో మన శక్తిని చాటినం: మోదీ
  • జమ్మూ కాశ్మీర్​ టూరిజాన్ని పాక్​ టార్గెట్ చేసింది
  • దేశంలో మత ఘర్షణలు రెచ్చగొట్టాలనుకున్నది 
  • ఎన్ని కుట్రలు పన్నినా కాశ్మీర్‌‌‌‌ అభివృద్ధిని అడ్డుకోలేరు
  • ఉగ్రవాదంపై పోరులో వెనక్కి తగ్గబోమని వెల్లడి
  • ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని
  •  కాశ్మీర్ లోయకు తొలి వందే భారత్​ సర్వీస్ ​ప్రారంభం

కాత్రా: పహల్గాంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని మానవత్వంపై పాకిస్తాన్ దాడి చేసిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘‘మన దేశంలో మత ఘర్షణలను రెచ్చగొట్టాలని పాక్​ చూసింది. పర్యాటకంపై ఆధారపడిన కాశ్మీరీ ప్రజల జీవనోపాధిని దెబ్బతీయాలని కుట్ర పన్నింది. అమాయక ప్రజల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నది. 

ఆపరేషన్‌‌‌‌ సిందూర్‌‌‌‌లో మన ఆయుధ సత్తాను చాటిచెప్పాం. పాక్​ పాలకులకు నిద్ర లేకుండా చేశాం’’అని తెలిపారు. పాకిస్తాన్‌‌‌‌ ఆటలను సాగనివ్వబోమని హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత శుక్రవారం మోదీ తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌‌‌‌లో పర్యటించారు. కాశ్మీర్ లోయకు తొలి వందే భారత్​ రైలు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి సహా అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. 

జమ్మూ కాశ్మీర్‌‌‌‌ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని, కాశ్మీర్‌‌‌‌ నుంచి కన్యాకుమారి వరకు ఇప్పుడు కనెక్టివిటీ ఉందని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమంలో మోదీ వెంట జమ్మూ కాశ్మీర్​ సీఎం ఒమర్​ అబ్దుల్లా, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్​, జితేంద్ర సింగ్​ ఉన్నారు. 

ఆ పేరు విన్నప్పుడల్లా పాక్​ సిగ్గుపడాల్సిందే

జమ్మూ కాశ్మీర్​లో గత ఐదేండ్లలో టూరిజం పెరుగుతున్నదని, ఇక్కడికి రికార్డు స్థాయిలో టూరిస్టులు వస్తున్నారని మోదీ తలిపారు. ఇక్కడి ప్రజలకు టూరిజం కడుపునింపుతున్నదని, అందుకే మన పర్యాటకాన్ని దెబ్బతీసి పేదల పొట్టగొట్టాలని పాక్​ చూస్తున్నదని మోదీ ఫైర్​ అయ్యారు. తన కుటుంబాన్ని పోషించేందుకు కష్టపడే ఆదిల్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ అనే పోనీవాలా (గుర్రంపై టూరిస్టులను తీసుకెళ్లే వ్యక్తి) ఆ రోజు ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడాడని గుర్తుచేశారు. 

అతడినీ ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్​ సిందూర్​చేపట్టి పాక్​కు గట్టి బుద్ధిచెప్పామని అన్నారు.  సరిగ్గా నెల రోజుల క్రితం పాకిస్తాన్​లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశామని గుర్తుచేశారు. పాక్‌‌‌‌ నాయకత్వానికి నిద్ర లేకుండా చేశామని తెలిపారు. ఆపరేషన్​ సిందూర్​పేరు విన్నప్పుడల్లా.. ఓటమిని తలుచుకొని పాక్​సిగ్గుపడాల్సిందేనని అన్నారు. 

ఎన్ని కుట్రలు పన్నినా కాశ్మీర్‌‌‌‌ అభివృద్ధిని పాకిస్తాన్ ​అడ్డుకోలేదని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్​ వెనక్కి తగ్గబోదని తెలిపారు. పాక్‌‌‌‌ కుయుక్తులను భారత్‌‌‌‌ ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటుందని, ఉగ్రకుట్రలకు దీటుగా బదులిస్తామని చెప్పారు. 

లక్షలాది మంది కలలు సాకారం

ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైలు మార్గం రూ.46వేల కోట్ల విలువైన ఇతర ప్రాజెక్టులతోపాటు ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఊతమిచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టు అనేక సవాళ్లను అధిగమించిందని, ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సంకల్పం, నిబద్ధత వల్ల సాకారమైందని తెలిపారు. ఈ రైలు మార్గం కాశ్మీర్‌‌‌‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కనెక్ట్​ చేస్తుందని, ఇదే సమయంలో పర్యాటకం, వాణిజ్యం, ఆర్థికవృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. 

కశ్మీర్‌‌‌‌లో ఈ ప్రాజెక్టుతో లక్షల మంది కల సాకారమైందని అన్నారు. చీనాబ్ బ్రిడ్జ్‌‌‌‌ వల్ల టూరిజం మరింత అభివృద్ధి అవుతుందని చెప్పారు. మన ఇంజనీర్ల ప్రతిభకు ఇది నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. ఈ బ్రిడ్జ్‌‌‌‌ నిర్మాణంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా.. మాతా వైష్ణోదేవి ఆశీర్వాదంతో నిర్మాణం పూర్తయిందని తెలిపారు. చీనాబ్, అంజి వంతెనల ద్వారా కాశ్మీర్ ఆపిల్స్ జాతీయ మార్కెట్‌‌‌‌కు తక్కువ ఖర్చుతో, సమయానికి చేరుకుంటాయన్నారు. 

దీనివల్ల స్థానిక రైతులకూ లాభం చేకూరుతుందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌‌‌‌ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని, కాశ్మీర్‌‌‌‌ నుంచి కన్యాకుమారి వరకు ఇప్పుడు కనెక్టివిటీ ఉందని వెల్లడించారు. కాశ్మీర్‌‌‌‌లో మరిన్ని మెడికల్‌‌‌‌ కాలేజీలు రానున్నాయని తెలిపారు.

నా ప్రమోషన్​ ఎప్పుడు: ఒమర్​ అబ్దుల్లా

జమ్మూ కాశ్మీర్‌‌‌‌కు రాష్ట్ర హోదా అంశాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా నేరుగా ప్రధాని మోదీ సమక్షంలో సరదాగా ప్రస్తావించారు.  ‘‘2014లో కాత్రా రైల్వేస్టేషన్ ప్రారంభమైనప్పు డు ఇదే నలుగురు వ్యక్తులు హాజరయ్యారు. అప్పుడు  రైల్వే సహాయ మంత్రిగా ఉన్న మనోజ్ సిన్హా.. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్​ గవర్నర్​గా ప్రమోట్ అయ్యారు. 

నేను ఒక రాష్ట్ర సీఎం నుంచి యూటీకి సీఎంగా డిమోట్ అయ్యా. పరిస్థితులు ఇప్పుడు సాధారణ స్థితికి చేరాయి. జమ్మూ కాశ్మీర్‌‌‌‌కు త్వరలోనే  ప్రధాని మోదీ.. రాష్ట్ర హోదా ఇస్తారని ఆశిస్తున్నా” అని వ్యాఖ్యానించారు.

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.