
లడ్డూలందు తిరుమల తిరుపతి లడ్డూ వేరు. దాని టేస్టు వేరు. దాని లెక్కే వేరు. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి ప్రసాదానికి ఉన్న డిమాండే వేరు. అది ప్రసాదం మాత్రమే కాదు.. కోట్ల మంది భక్తుల సెంటిమెంట్. మరలాంటి లడ్డూని.. మరొకరు కాపీ కొడితే వెంకన్న స్పెషాలిటీ ఏముంటుంది? అందుకే, అలాంటివారికి దొరక్కుండా జీఐ ట్యాగింగ్ చేయించింది తిరుమల తిరుపతి దేవస్థానం. అయినా, కొన్ని సంస్థలు యథేచ్ఛగా కాపీ కొట్టేస్తున్నాయట. ఇంతకీ లడ్డూపై ఎంటీ జీఐ ట్యాగింగ్ ఏంటి? దాన్ని ఉల్లంఘిస్తున్నదెవరు?
తిరుమల లడ్డు.. కొండల రాయుడికి ప్రీతిపాత్రమైన లడ్డు ఏడుకొండలంత కీర్తిని సొంతం చేసుకుంది. విశ్వవ్యాప్తంగా విస్తరించింది. అంతే కాదు పేటెంట్ హక్కుల్ని సాధించుకుంది. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ చట్టం కింద జీఐ రిజిస్ట్రీ లోనూ స్థానం సంపాదించుకుంది. అయితే ఇప్పుడు కొన్ని మిఠాయి దుకాణాల్లోనూ తిరుమల లడ్డు పేరు వినిపించడం, కనిపించడంతో టీటీడీ సీరియస్ వ్యవహరిస్తోంది. దేశ విదేశాల్లో ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్, డైరెక్ట్గా తిరుమల లడ్డు పేరుతో జరుగుతున్న విక్రయాలపై కొరడా జులిపించింది. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్తో కూడిన లడ్డు పవిత్రతను కాపాడేందుకు లీగల్ నోటీసులు ఇచ్చింది.
కల్తీ నెయ్యి వివాదం ఇప్పుడిప్పుడే సమిసిపోతున్న వేళ.. తిరుమల వెంకన్న లడ్డూలకు మరో ప్రమాదం వచ్చిపడింది. ప్రపంచంలోనే మేటి దైవప్రసాదంగా పేరొందిన లడ్డూలకు.. జిరాక్స్ కాపీలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. అమృతతుల్యమైన శ్రీవారి లడ్డూప్రసాదాన్ని కూడా కొందరు.. తమ వ్యాపారాల కోసం వాడుకోవడం చర్చనీయాంశమవుతోంది. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీవ్రంగా పరిగణిస్తోంది. లడ్డూ పవిత్రతను, దానికోసం ఏర్పాటు చేసిన జీఐ టెక్నాలజీని కాపాడేందుకు కఠినచర్యలు తీసుకుంటోంది.
తిరుపతి లడ్డూ టేస్టు, మరే ఇతర ప్రసాదాల్లోనూ కనిపించదంటే అతిశయోక్తి కాదు. అంతటి ప్రత్యేకత వెంకటేశ్వరుడి ప్రసాదానికి ఉంటుంది. ఆ ప్రత్యేకతను, పవిత్రతను కోల్పోకుండా.. ఈ లడ్డూకు జీఐ ట్యాగింగ్ చేయించింది టీటీడీ. అయితే, తిరుపతి లడ్డూ అంటే చాలు.. లొట్టలేసే భక్తులు కోట్లలో ఉంటారు. ఆ డిమాండ్ను క్యాష్ చేసుకోవడానికి.. పలు సంస్థలు నకిలీ లడ్డూలను తయారు చేసి విక్రయిస్తున్నట్టు టీటీడీ గుర్తించింది. అలాంటి సంస్థలకు నోటీసులు జారీ చేసింది. పుష్ మై కార్ట్ , ట్రాన్సాక్ట్ ఫుడ్స్ లిమిటెడ్ సహా పలు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కు లీగల్ నోటీసులు పంపింది. ఈ సంస్థలు ఆన్లైన్లో యథేచ్ఛగా తిరుపతి లడ్డూలంటూ తమ ప్రోడక్ట్స్ని విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది.
తిరుపతి లడ్డూలను ఎవరూ కాపీ కొట్టకుండా.. జియోగ్రాఫికల్ ఐండికేషన్స్ ఆఫ్ గూడ్స్ చట్టం ప్రకారం, జీఐ హక్కులను సాధించింది టీటీడీ. దీని ప్రకారం ఎవరు తిరుపతి లడ్డూను నకిలీ తయారుచేసినా.. శిక్షార్హులవుతారు. ప్రస్తుతం ఆ చట్టం ప్రకారమే.. సదరుసంస్థలకు నోటీసులు పంపింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. జియోగ్రాఫికల్ ఇండికేషన్ హక్కుల్ని ఉల్లంఘిస్తూ .. తిరుమల వెంకన్న లడ్డూల పేరిట, తమ ఉత్పత్తులను విక్రయిస్తున్న సంస్థలపై కొరడా ఝళిపించింది. వారిపై చట్టపరంగా చర్యలకు సిద్ధమైంది.
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో చాలా నగరాల్లో ఆలయాలు నిర్మితమయ్యాయి. ఆయా చోట్ల తిరుపతి లడ్డూలను కూడా అందుబాటులో ఉంచుతోంది. అయితే, లడ్డూల తయారీ మాత్రం.. ఒక్క తిరుమలలోనే, అది కూడా స్వామివారి సన్నిధిలోనే… టీటీడీ పర్యవేక్షణలో జరుగుతుంది. అనాదిగా వస్తున్న ఆచారం ఇది. అది దెబ్బ తినకుండా… జీఐ ట్యాగింగ్ చేసినప్పటికీ, నకిలీగాళ్లు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో టీటీడీ అలెర్టయ్యింది. అడ్డంగా దొరికిన ఆన్లైన్ సంస్థలకు.. నోటీసులు పంపింది. ఈ దెబ్బకు ఇతర సంస్థలు కూడా.. తమ మెనూ లిస్టులోంచి తిరుపతి లడ్డూను పోలిన ప్రొడక్ట్స్ను తొలిగించాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని కాపాడటానికి, స్వామివారి లడ్డూ పవిత్రతను కాపాడేందుకు ఎంతటి కఠినచర్యలు తీసుకోవడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించింది టీటీడీ.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..