
Minister Uttam: బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత ఆర్ధిక నష్టం ఏర్పడిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన 162 టీఎంసీ నీళ్లే.. అలాగే, కాళేశ్వరానికి మేడిగడ్డనే గుండె కాయ అనేది మీరే.. అలాంటప్పుడు మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన నీళ్ళే ప్రామాణికం కాదా?.. అని ప్రశ్నించారు. 2019లోనే బ్యారేజీ నిర్మాణం పూర్తి అయ్యింది.. 2019-2020లో 61 టీఎంసీల నీళ్ళు, 2020-21లో 31.82 టీఎంసీల నీళ్ళు.. 2021- 22లో 33 టీఎంసీల నీళ్లు.. 2022- 23లో 25.97 టీఎంసీల నీళ్లు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Read Also: Satyakumar Yadav : ప్రతి ఒక్కరి సంక్షేమమే బీజేపీ ధ్యేయం.. మంత్రి సత్యకుమార్ యాదవ్..
అయితే, 2023-24లో 8.93 టీఎంసీ నీళ్లు లిఫ్ట్ చేశారు అని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పుకొచ్చారు. దీంట్లో వరద రాగానే సముద్రంలోకి వదిలిన నీళ్ళు 63 టీఎంసీలు.. ఐదేళ్లలో 99 టీఎంసీల నీళ్లతో 22 లక్షల ఎకరాలకు నీళ్లు ఎలా ఇచ్చావో చెప్పు అని ప్రశ్నించారు. మీ తప్పుడు నిర్ణయాలు, కక్కుర్తి వల్లే తెలంగాణకు శాశ్వత నష్టం జరిగింది అని మండిపడ్డారు. బేషరతుగా బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి ప్రధాన కారణం కేసీఆర్, హరీష్ రావులే అని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు.