. 2 minutes
పిల్లల్ని కనండి మహాప్రభో.. వేడుకుంటున్న దేశాలు.. దంపతులకు తాయిలాల ఎర.. అయినా ఫలితం శూన్యం..

ప్రపంచంలోని అనేక ప్రధాన దేశాలలో జనాభా గణనీయంగా తగ్గిపోవడంతో ఆందోళన చెందుతోంది. ఒకానొక సమయంలో జనాభా పెరుగుదల గురించి ఆందోళన చెందిన దేశాలు ఇప్పుడు తగ్గుదల గురించి ఆందోళన చెందుతున్నాయి. ఒకప్పుడు జనాభా విస్ఫోటనాన్ని సంక్షోభంగా పరిగణించినప్పటికీ.. ఇప్పుడు చాలా దేశాలు వృద్ధాప్య జనాభా, తక్కువ సంతానోత్పత్తి రేటు కారణంగా కార్మిక శక్తి కొరత వంటి తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. ఆ దేశాల పరిస్థితి ఎలా ఉందంటే.. ప్రభుత్వాలు కొత్తగా పెళ్లైన జంటలను వెంటనే పిల్లలను కనమని ప్రోత్సహిస్తున్నాయి. రకరకాల బహుమతులను కూడా ప్రకటిస్తున్నాయి. అయినా ఎటువంటి ప్రభావం కనిపించడం లేదు. జనన రేటు తగ్గడం వల్ల చాలా ఆందోళన చెందుతున్నఐదు దేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

టర్కీ: ముగ్గురు పిల్లలు తప్పనిసరి
టర్కీ జనన రేటు 2001లో 2.38గా ఉండగా.. 2025లో ఇది 1.48కి పడిపోయింది. ఈ సంఖ్య ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా కంటే కూడా తక్కువ. అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ దీనిని యుద్ధం కంటే పెను ముప్పుగా అభివర్ణించారు. ఆయన 2025ని కుటుంబ సంవత్సరంగా ప్రకటించారు. కొత్త సంవత్సరం అంటే 2026 నుంచి కుటుంబం పెరిగేందుకు.. ముగ్గురు పిల్లల్ని కనడం తప్పని సరి చేశారు. కొత్త జంటలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజలు తమ కుటుంబాలను విస్తరించడానికి అంటే పిల్లల్ని కనేందుకు వెనుకాడుతున్నారు.

వియత్నాం: ఇద్దరు పిల్లల విధానం
వియత్నాం దశాబ్దాల క్రితమే ఇద్దరు పిల్లల విధానానికి స్వస్తి చెప్పినిడ్. ఇప్పుడు ఆ దేశ ప్రజలు తమకు కావలసినంత మంది పిల్లలను కలిగి ఉండవచ్చు. 1999 నుంచి 2022 వరకు ఇక్కడ సగటు జనన రేటు 2.1గా ఉంది. అయితే 2024లో ఇది 1.91కి తగ్గుతుంది. జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ , సింగపూర్ వంటి ఇతర ఆసియా దేశాలలో కూడా ఇదే ధోరణి కనిపిస్తుంది. అయితే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు వియత్నాం కంటే చాలా బలంగా ఉన్నాయి. వియత్నాం తమ ప్రజలకు వృద్ధాప్యం రాకముందే ఆర్ధిక వ్యవస్థ బలంగా కావాలని ప్రయత్నిస్తోంది.

చైనా: 1.4 బిలియన్ల నుంఛి 800 మిలియన్లకు?
చైనా జనాభా గత మూడు సంవత్సరాలుగా వరసగా తగ్గుతోంది. UN అంచనాల ప్రకారం ఈ శతాబ్దం చివరి నాటికి ఇది 1.4 బిలియన్ల నుంచి 800 మిలియన్లకు తగ్గవచ్చు. ప్రస్తుతం చైనాలో వృద్ధ జనాభా అధికంగా ఉంది. దీంతో పని చేసే వయసున్న జనాభా తగ్గింది, మరోవైపు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ పెరుగుతోంది. ఆరోగ్యం, సంరక్షణ అవసరాలు వంటి వివిధ కారణాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తోంది. ఒకప్పుడు ఒక శిశివు విధానం ఎంత కఠినంగా అమలు చేసిందో తెలిసిందే. అయితే ఇప్పుడు పిల్లల్ని కనమంటున్నా.. జీవన వ్యయం కారణంగా యువతరం పిల్లలను కోరుకోవడం లేదు.

న్యూజిలాండ్: ఎక్కువ మంది మహిళలు, తక్కువ మంది పిల్లలు
న్యూజిలాండ్‌లో జనన రేటు 2023లో రికార్డు స్థాయిలో 1.56కి చేరుకుంది. ప్రత్యేకత ఏమిటంటే దేశంలో 15 నుంచి 49 సంవత్సరాల వయస్సు గల మహిళల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ దేశంలో ఇప్పటికీ పిల్లల సంఖ్య తక్కువగానే ఉంది. 2022లో ఈ రేటు 1.66గా ఉంది. ఇది ఇప్పటికే జనాభాను నిర్వహించడానికి అవసరమైన 2.1 రేటు కంటే చాలా తక్కువగా ఉంది. పిల్లలను కనడం ఇక నుంచి ప్రాధాన్యత ఇవ్వమని దంపతులు చెప్పకనే చెబుతున్నాయి.. అదే విషయాన్నీ ఈ గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.

ఉత్తర కొరియా: గణాంకాలు లేవు, కానీ ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయం.
ఉత్తర కొరియా తన జనాభా గణాంకాలను వెల్లడించదు.. కానీ UN అంచనాల ప్రకారం.. ఆ దేశంలో కూడా జనన రేటు 1.78. ఈ రేటు దక్షిణ కొరియా, జపాన్ , చైనా కంటే ఎక్కువగా ఉంది. ఇప్పటికీ అవసరమైన 2.1 కంటే తక్కువగా ఉంది. ఈ ధోరణి కొనసాగితే రాబోయే సంవత్సరాల్లో ఇక్కడ కూడా కార్మికుల కొరత, సామాజిక నిర్మాణం కూలిపోయే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం జనాభా కొరతతో ఈ ఐదు దేశాలు ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇక్కడ జనాభా తగ్గుదల ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా మారింది. శ్రామిక ప్రజల కొరత, పెన్షన్, ఆరోగ్య సేవల భారం , భవిష్యత్తులో ఆర్థిక మాంద్యం వంటి ప్రమాదాలు ఉన్నాయి. పిల్లలు లేకపోతే ఆ దేశంలో కొత్త శక్తి ఆగిపోతోంది. కనుక ఇప్పుడు ఆ దేశ ప్రభుత్వాలు ఆగిపోయిన పిల్లల జననాన్ని మళ్ళీ పునరుద్ధరించడంలో నిమగ్నమై ఉన్నాయి.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.