
ఆలయానికి వెళ్లిన ఓ కుటుంబం దగ్గరున్న రూ.20 లక్షల విలువైన నగల పర్సును కోతి కొట్టేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బృందావన్లో జరిగింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తీవ్ర గాలింపు చేపట్టిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ను జల్లెడ పట్టారు. అనంతరం పర్స్ను గుర్తించి బాధితులకు అందించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కోతి రూ.20 లక్షల పర్సును ఎత్తుకెళ్లిందనే వార్త స్థానికంగా వైరల్గా మారింది.
పోలీసుల వివరాల ప్రకారం.. బృందావన్లోని బాంకే బిహారీ ఆలయానికి అలీఘర్కు చెందిన అభిషేక్ అగర్వాల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి వచ్చాడు. గుడిలోకి వెళ్తున్న సమయంలో దొంగలు ఉంటారనే భయంతో అభిషేక్ భార్య తన 20 లక్షల రూపాయల విలువైన నగలను తీసి పర్సులో పెట్టుకున్నారు. వారు గుడి నుంచి తిరిగివస్తుండగా బయట ఉన్న ఓ కోతి వారి దగ్గరున్న రూ.20 లక్షల విలువైన నగలు ఉన్న పర్సును లాక్కొని ఇరుకైన సందుల గుండా పారిపోయింది. ఎంత వెతికినప్పటికీ లాభం లేకపోవడంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో తీవ్ర గాలింపుచేపట్టారు. కొన్ని గంటల తర్వాత కోతి పర్సును చెట్ల పొదల్లో పడేసి వెళ్లడంతో దానిని తీసుకొని అభిషేక్కు అప్పగించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.