
విజయనగరం, జూన్ 7: విజయనగరం జిల్లాలో జరిగిన ఓ హృదయ విదారక ఘటన అందరినీ కలిచివేస్తుంది. తెర్లాం మండలం మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన రామిశెట్టి అనే దుస్తుల వ్యాపారి జీవనోపాధి కోసం బట్టలు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య పి వెంకటమ్మ (42) ఇంట్లోనే ఉంటూ, ఇద్దరు ఆడపిల్లలు, పశువుల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తూ కుటుంబాన్ని నడిపిస్తుంది. ఎంతో కష్టపడి, పైసా పైసా కూడ పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తున్నారు. అందులో భాగంగా రెండో కుమార్తె గౌరి పెళ్లి మే 20న ఘనంగా జరిగింది. వీరి ఇంట్లో పెళ్లి లాంఛనాలు, పెళ్లి సందడి ముగియక ముందే విషాదం వీరి కుటుంబాన్ని చుట్టుముట్టింది.
శుక్రవారం రోజు వెంకటమ్మ ఇంటికి సమీపంలోని పశువులశాలలో ఉన్న పశువులకు దాణా పెడుతుండగా, అకాల వానలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఇది చూసిన చుట్టుపక్కలవారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. పిడుగు ప్రమాదంతో ఒక సామాన్య కుటుంబానికి తీరని నష్టాన్ని మిగిల్చింది. రెండో కుమార్తె వివాహం జరిగిన కుటుంబంలో తల్లి మరణం కుటుంబ సభ్యులను కుంగదీసింది. పచ్చని పందిరి వేసిన అదే ప్రాంగణంలో పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామమంతా విషాదంలో మునిగింది. ప్రభుత్వం కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుని అండగా నిలవాలని గ్రామస్థులు కోరుతున్నారు. అధికారులు స్పందించి వెంకట లక్ష్మి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.