
హైదరాబాద్: భార్యను చంపాలని ప్లాన్ వేసుకున్నాడు. ధైర్యం కోసం ఫుల్ గా తాగాడు. భార్యను చంపబోతున్నాను అనే కసిలో కాస్త ఎక్కువ తాగేశాడు. తాగిన మత్తులో పక్కింట్లోకి వెళ్లి మహిళపై దాడి చేశాడు. ఈ ఘటన మైలార్దేవ్పల్లి పరిధి కాటేదాన్ లో శుక్రవారం (జూన్ 6) చోటుచేసుకుంది.
తాగి పక్కింట్లోకి వెళ్లిన 60 ఏళ్ల వ్యక్తి.. నిద్రిస్తున్నది తన భార్యే అనుకుని ఆమెపై దాడి చేశారు. నిద్రిస్తున్నన మహిళను కత్తితో పొడిచాడు. కత్తి పోటు భరించలేక మహిళ గట్టిగా అరవటంతో పరారయ్యాడు.
నిందితుడిని మహారాష్ట్ర నాందేడ్ కు చెందిన సలీమ్ గా గుర్తించారు. అతని భార్య రేష్మతో కలిసి కాటేదాన్ ఏరియాలో ఉంటున్న తన కూతురుని కలిసేందుకు వచ్చారు. బక్రీద్ సందర్భంగా మైలార్ దేవ్ పల్లి టీఎన్జీవో కాలనీలో ఉంటున్న కూతురు ఇంటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
శుక్రవారం రాత్రి బాగా తాగిన సలీమ్.. భార్య రేష్మాతో గొడవకు దిగాడు. ఆ గొడవలో కూరగాయల కత్తితో చంపేస్తానంటూ బెదిరించాడు. అనుకున్నట్లుగానే రాత్రి పక్కింట్లో నిద్రిస్తున్న మహిళను తన భార్యే అనుకుని పొడిచాడు. దీంతో జుబేదా అనే 26 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె కండిషన్ చాలా క్రిటికల్ గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహిళను పొడిచి పరారైన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.