
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 2025, జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం మొదలు కానుంది. మృగశిర కార్తె సందర్భంగా జూన్ 8, 9 తేదీల్లో బత్తిన కుటుంబం ఎగ్జిబిషన్గ్రౌండ్లో ప్రతి యేటా చేప ప్రసాదం పంపిణీ చేస్తుంది. చేప ప్రసాదానికి సంబంధించిన టోకెన్లు శనివారం (జూన్ 7) నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో టోకెన్ల కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్దకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. టోకెన్స్ పంపిణీ ఆలస్యం కావడంతో క్యూలైన్లో పబ్లిక్ అసహనం వ్యక్తం చేశారు.
టోకెన్ల పంపిణీ ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటూ నిలదీశారు. ఉదయం నుంచి వేచి చూసి ఓపిక నశించిన జనం.. టోకెన్ల పంపిణీ స్టార్ట్ చేయడంతో ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. వేల మందికి కేవలం రెండు కౌంటర్లే ఏర్పాటు చేయడంతో జనం ఇబ్బందులు పడ్డారు. మరోవైపు నాంపల్లిలో ఒక్కసారిగా భారీ వర్షం కురువడంతో టోకెన్ల పంపిణీ వద్ద ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.
కాగా, చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈనెల 8న జరిగే చేప ప్రసాద పంపిణీకి తరలివచ్చేవారి కోసం గ్రేటర్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నది. మృగశిర కార్తె సందర్భంగా 8, 9 తేదీల్లో బత్తిన కుటుంబం ఎగ్జిబిషన్గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ చేస్తుంది. దీని కోసం వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో అస్తమా బాధితులు తరలివస్తారు. వీరికి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నది. 8వ తేదీన 60 , 9వ తేదీన 80 బస్సులు నడపనున్నట్టు అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్లతో పాటు జేబీఎస్, ఎంజీబీఎస్, నాంపల్లి, కోఠి, ఈసీఐఎల్క్రాస్రోడ్స్, శంషాబాద్ఎయిర్పోర్ట్ తదితర ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. గ్రేటర్లోని 14 డిపోల నుంచి 80 బస్సులు, ఎయిర్పోర్ట్నుంచి 60 బస్సులు నడపనున్నట్టు చెప్పారు. ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా నార్మల్ రేట్లనే వసూలు చేస్తామని, ప్రయాణికుల సంఖ్యను బట్టి అదనపు బస్సులు నడిపే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.