
మెదక్ (చేగుంట), వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్స్ సంఖ్యను పెంచి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం చేగుంట మండల కేంద్రంలోని సుభాష్ నగర్ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన గ్రామసభలో డీఈవో రాధాకిషన్ తో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యమైన విద్య ప్రభుత్వ స్కూళ్ల ద్వారా మాత్రమే సాధ్యమన్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్స్కు యూనిఫార్మ్స్, టెస్ట్ అండ్ నోట్ బుక్స్ ఫ్రీగా అందిస్తున్నట్టు తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. బడి ఈడు పిల్లలందరూ బడిలో చేరాలని పిలుపునిచ్చారు. అనంతరం మండల కేంద్రంలో బడిబాట ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన డీవీ శ్రీనివాస రావు కలెక్టర్రాహుల్రాజ్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎస్పీని కలెక్టర్ స్వాగతిస్తూ అభినందనలు తెలిపారు.
సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి..
భూ సమస్యలు పరిష్కారానికి ప్రవేశపెట్టిన రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో రెవెన్యూ సదస్సును కలెక్టర్ సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ దరఖాస్తులను రికార్డులతో సరి చూసి క్షేత్రస్ధాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు.
కుంట కబ్జాపై కలెక్టర్ కు ఫిర్యాదు
శివ్వంపేట: మండలంలోని కొంతన్ పల్లి గ్రామ శివారులో ఫామ్ ల్యాండ్ వెంచర్ యజమానులు కరీంకుంటను కబ్జా చేసి కట్టడాలు నిర్మించారని మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు కరుణాకర్ రెడ్డి, గ్రామస్తులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. గతంలో రెవెన్యూ అధికారులు పలుమార్లు పరిశీలించినప్పటికీ సమస్యను పరిష్కరించలేదని తెలిపారు. వెంచర్ యజమానులు కుంటలో మత్స్యకారులను చేపలు పట్టనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. వెంటనే కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.