
- పదేండ్ల పాలనలో ఆలయానికి మీరేం చేశారు?
హైదరాబాద్, వెలుగు: రాజన్న కోడెలపై రాజకీయం చేయవద్దని మంత్రి కొండా సురేఖ కోరారు. గడిచిన పదేండ్లలో వేములవాడ టెంపుల్, దేవాదాయ శాఖకు సంబంధించి బీఆర్ఎస్ పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేములవాడ టెంపుల్ కు ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి కొండా సురేఖ ఓ విడుదల చేశారు. గత ప్రభుత్వం 100 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి నిధులు కేటాయించకపోవడంతోనే వేములవాడలో రాజన్న కోడెలకు ఈ దుస్థితి వచ్చిందని చెప్పారు.
కోడెల ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంలో బురద రాజకీయం చేయడం సరికాదన్నారు. సరస్వతీ పుష్కరాలను సక్సెస్ ఫుల్ గా నిర్వహించామన్నారు. పుష్కరాలకు 30 లక్షల మంది భక్తులు వచ్చారన్నారు. యాదగిరిగుట్టపై కేసీఆర్ బొమ్మలను చెక్కించుకున్న వారికి అసలు దేవుళ్ల విషయంలో మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. రూ.63 కేజీల బంగారంతో యాదగిరిగుట్ట గోపురానికి తాపడం చేయించామన్నారు.
కేసీఆర్ కుటుంబంలో అంతర్గత గొడవలతో బీఆర్ఎస్ నాయకులకు ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం సూచన మేరకు వేములవాడలో సువిశాలమైన గోశాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. రాజన్న ఆలయ విస్తరణ, కోడెల విషయంలో తమ ప్రభుత్వం వెంటనే స్పందించిందని మంత్రి పేర్కొన్నారు.