. 2 minutes

కార్పొరేషన్ ఏర్పాటు తరువాత
అందులో ఆర్థికశాఖ జోక్యం
ఉండదు కేబినెట్ నిర్ణయాల
మేరకే మూడు బ్యారేజీల
నిర్మాణాలు తుమ్మిడిహట్టి
వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి
మహారాష్ట్ర అభ్యంతరం
చెప్పింది సాంకేతిక కమిటీ
నివేదికల మేరకే మంత్రివర్గ
ఉపసంఘం నిర్ణయం
కాళేశ్వరం కమిషన్ ఎదుట
ఎంపి ఈటల సమాధానాలు
కాళేశ్వరం బాధ్యులపై చర్యలు
తీసుకోవాలి నా కణత మీద
తుపాకీ పెట్టినా అబద్ధం చెప్పను
కాంగ్రెస్ బట్టకాల్చి
మీదవేయడం మానుకోవాలి
మీడియాతో ఈటల వ్యాఖ్యలు

మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా శు కవారం జస్టిస్ పిసి ఘోష్ ముందు మాజీ ఆర్థిక మంత్రి, మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ ఘోష్ అడిగిన ప్రశ్నలకు ఈటల రాజేందర్ సమాధానాలు ఇచ్చారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు జరిగిన విచారణలో కమిషన్ అడిగిన పలు అంశాలకు సమాధానాలు చెప్పారు. మీరు ఆర్ధిక మంత్రిగా ఏకాలంలో పనిచేశారు అన్న జస్టిస్ ఘోష్ తొలి ప్రశ్నకు ఈటల సమాధానమిస్తూ 2014 జూన్ రెండో తేదీ నుంచి 2018 డిసెంబర్ వరకు తాను ఆర్థ్ధికమంత్రిగా బాధ్యతలు నిర్వహించానని చె ప్పారు. ఎవరి నిర్ణయం మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టారనే ప్రశ్నకు ఈటల సమాధానం ఇస్తూ రూ.38వేల
కోట్ల అంచనా వ్యయంతో తుమ్మిడిహట్టి వద్ద తలపెట్టగా, ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. దాంతో 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు కుదించారని, ప్రాజెక్టు నీటిని రూరల్ డ్రింకింగ్ వాటర్ కోసం 10 టిఎంసిలు, అర్బన్ డ్రింకింగ్ వాటర్ కోసం 30 టిఎంసిలు, ఇండస్ట్రియల్ వాటర్ యూజర్ కింద 15 టిఎంసిలు ఖారారు చేశారని, 16.5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్షంగా పెట్టుకున్నట్లు ఈటల వివరించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలపై టెక్నికల్ కమిటీ నివేదిక ఇచ్చిందని, దానిపై నాటి ముఖ్యమంత్రి కెసిఆర్ ముగ్గురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసినట్లు చెప్పారు.

నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన ఆర్థిక మంత్రిగా తాను, తుమ్మల నాగేశ్వరరావు టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసి రూ.63వేల కోట్ల అంచనా వ్యయంతో మూడు బ్యారేజీల నిర్మాణాలకు మంత్రి వర్గ ఉపసంఘం నివేదిక ఇచ్చిందని తెలిపారు. మంత్రి వర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్న క్రమంలో రైతుల నుంచి డిమాండ్స్ వచ్చాయని, దాంతో ప్రాజెక్టు వ్యయం రూ.80 వేల నుంచి 85వేల కోట్లు పెరిగిందని, ఆతర్వాత ఏమేరకు ప్రాజెక్టు వ్యయం పెరిగిందో తనకు తెలియదని వివరించారు. కేబినెట్ సబ్ కమిటీ ఎవరి నిర్ణయం మేరకు 2016 మార్చి 15వ తేదీన మూడు బ్యారేజిల నిర్మాణాలపై రిపోర్టు ఇచ్చిందని జస్టిస్ ఘోష్ ప్రశ్నించగా, టెక్నికల్ రిపోర్టును ఆధారంగా చేసుకుని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసిందని, మంత్రివర్గం నిర్ణయం మేరకు బ్యారేజీల నిర్మాణాలు జరిగాయని ఈటల చెప్పారు. టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కమిటీ ఆ మూడు చోట్ల బ్యారేజీలను నిర్మించాలని చెప్పిందా ? అన్న ప్రశ్నకు ఈటల సమాధానమిస్తూ టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కమిటీ గోదావరి వెంట చాలా చోట్ల స్టడీ చేయడం జరిగిందని, చివరకు అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల వద్ద నిర్మాణాలు జరిగాయని, అన్నీ మంత్రివర్గం ఆమోదం మేరకు జరిగాయని తెలిపారు.

కాళేశ్వరం కార్పొరేషన్ ను ఎందుకు ఏర్పాటుచేశారన్న ప్రశ్నకు ఈట రాజేందర్ సమాధానం ఇస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల బాగాలేని కారణంగానే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్‌ను ఏర్పాటుచేయాల్సి వచ్చిందని, కార్పొరేషన్ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిందని తెలిపారు. ఆర్ధిక క్రమశిక్షణ లేదని మీరు భావించారా అన్న ప్రశ్నకు ఈటల సమాధానమిస్తూ 2018లో కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు అయ్యాక దాని వ్యవహారాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ జోక్యం ఉండదు, బడ్జెట్ కేటాయింపుల వరకు నా బాధ్యత అన్నారు. ఆ స్థలాలు బ్యారేజిల నిర్మాణానికి అనువైనవేనని మీరు భావించారా ? అన్న ప్రశ్నకు ఈటల రాజేందర్ సమాధానం ఇస్తూ అది టెక్నికల్ అంశం, దానికి వారే అభ్యంతరం చెప్పాలి, రాజకీయనాయకులుగా మాకు సంబంధం ఉండదు అని సమాదానం ఇచ్చారు. కాళేశ్వరం కార్పొరేషన్‌లో ఆర్ధిక క్రమశిక్షణ లేదని మీరు భావించారా ? అన్న కమిషన్ ప్రశ్నకు ఈటల రాజేందర్ సమాధానం నీటిపారుదల శాఖకు ప్రత్యేకంగా అకౌంట్స్ విభాగం, ఆడిట్ విభాగాలు ఉంటాయి, అవే స్క్రూట్నీ చేసుకోవాలని సమాధానం ఇచ్చారు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.