
Ambani Charity: ఎంత ఎదిగినా ఒదిగి ఉండటంతో పాటు మనం ఎక్కడి నుంచి వచ్చామనే విషయాలను మర్చిపోకూడదని పెద్దలు చెబుతుంటారు. అయితే దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఈ విషయాన్ని ఎక్కువగా నమ్ముతారని అనిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే ముఖేష్ అంబానీ తాను 1970లలో చదువుకున్న ముంబైలోని ఇన్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి పెద్ద మెుత్తంలో ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తనను అంతటివాడిగా తీర్చిదిద్దిన కాలేజీకి ఎలాంటి నిబంధనలు లేకుండా రూ.151 కోట్లను గ్రాంట్ రూపంలో అందిస్తున్నట్లు నేడు ప్రకటించారు. కళాశాల కార్యక్రమంలో 3 గంటలు గడిపిన అంబానీ.. ప్రొఫెసర్ ఎంఎం శర్మ బయోగ్రఫీ డివైన్ సైన్టిస్ట్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రొఫెసర్ శర్మ పాటాలు తనను ఎలా ఆకట్టుకున్నాయో అంబానీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆయన భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో పాల్గొన్నారని పేర్కొన్నారు. అప్పట్లో లైసెన్స్ రాజ్ నుంచి ప్రపంచంతో పోటీపడేందుకు ఆర్థిక సంస్కరణల రూపకల్పనలో కృషిని కొనియాడారు. తన తండ్రి ధీరూభాయ్ అంబానీ మాదిరిగానే శర్మ కూడా భారత పరిశ్రమలను ప్రపంచ స్థాయికి ఎదిగేలా చేయాలనే కోరికతో ఉండేవారని చెప్పారు. ఆయనను రాష్ట్ర గురు అంటూ కొనియాడారు.
శర్మ ఏదైనా చెబుతున్నప్పుడు తాము అలా వింటూ ఉండిపోయేవారిమి అంబానీ గుర్తుచేసుకున్నారు. అయితే తనను కళాశాలకు ఏదైనా పెద్దది చేయాలంటూ కోరిన మాటలను మరచిపోని అంబానీ ప్రస్తుతం గ్రాంట్ రూపంలో రూ.151 కోట్లను అందించాలని నిర్ణయించారు. తాను ప్రస్తుతం ఇస్తోంది గురుదక్షిణగా భావిస్తున్నట్లు వ్యాపారవేత్త అన్నారు.