
రాజంపేటలో టీడీపీకి బిగ్ షాక్..!
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా.. టీడీపీ, జనసేన, బీజేపీలోకి వలసలు వచ్చారు నేతలు.. ఎంపీ, ఎమ్మెల్సీలు, కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు సైతం.. వైసీపీకి గుడ్బై చెప్పి.. కూటమి పార్టీలో చేరారు.. అయితే, ఇప్పుడు.. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.. గత ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన సుగవాసి బాలసుబ్రమణ్యం.. ఇప్పుడు, టీడీపీకి గుడ్బై చెప్పారు.. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పంపారు సుగవాసి బాలసుబ్రమణ్యం.. “ప్రజల సలహాలను, సూచనలను, అభిప్రాయాలను, మనోభావాలను గౌరవిస్తూ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను…” అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖలో పేర్కొన్నారు సుగవాసి బాలసుబ్రమణ్యం..
వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు.. సీఎం సీరియస్ వార్నింగ్
ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా ఈ నెల 12వ తేదీన అమరావతిలో కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు.. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.. ఇక, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనే సమాచారం నా దగ్గర ఉంది.. ప్రజలు మనలను గమనిస్తున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలని అలర్ట్ చేశారు.. ఇక, ఎవరైనా వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. సరైన పనివిధానాన్ని చూపించలేకపోతే.. మళ్లీ సీటు ఇవ్వడం కుదరదు అనే సంకేతాలను ఇచ్చారు.. మరోవైపు, 2024 జూన్ కు ముందు ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉంది.. ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు.. ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తున్నాం.. వచ్చే నెల నాటికి పార్టీలోని అన్ని కమిటీల నియామకం పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
మంత్రి గారికి కోపం వచ్చింది.. బొకే విసిరికొట్టింది..!
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవితకు కోపం వచ్చింది.. ఎంతలా అంటే.. ఓ అధికారి ఇచ్చిన బొకేను విసిరికొట్టేశారు మంత్రి.. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. ఆలస్యంగా వెలుగు చూడగా.. సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి.. మంత్రిగారికి ఎందుకంత కోపం..? ఏమిటా ప్రెస్టేషన్..? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.. తాజాగా, పెనుకొండ సీఎస్డీటీకి వెళ్లారు మంత్రి ఎస్. సవిత.. అయితే, అక్కడ ఓ అధికారి ఇచ్చిన బొకేను సీరియస్గా వెనక్కి విసిరేశారు.. ఆ బొకే కాస్తా.. గన్మన్ను తాకుతూ.. వెనక్కి పడిపోయింది.. అయితే, ఆలస్యంగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు రాగా.. ఇప్పుడా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాపోయాయి.. ఈ నెల 1వ తేదీన అధికారులతో జరిగిన మీటింగ్ లో ఈ ఘటన జరిగినట్టుగా చెబుతున్నారు.. నిత్యవసరల సరుకుల పంపిణీ రేషన్ షాపుల పునః ప్రారంభం కార్యక్రమంలో ఫ్లవర్ బొకేను విసిరేశారట మంత్రిగారు.. జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలో.. ఈ ఫ్లవర్ బొకే ఇష్యూ జరిగింది.. ఆలస్యంగా.. వెలుగుచూసినా.. ఆ దృశ్యాలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..
ఈరోజు నీళ్లు.. నిధులు.. నియామకాలు ట్యాగ్ లైన్ లేదు.. నిందలు.. దందాలు.. చందాలు అనేది నడుస్తోంది
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఈరోజు నీళ్లు.. నిధులు.. నియామకాలు ట్యాగ్ లైన్ లేదు. నిందలు.. దందాలు.. చందాలు అనేది నడుస్తోంది. ఇదే కాంగ్రెస్ పాలన అని తీవ్ర విమర్శలు చేశారు. నీళ్ల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు పాత్ర చాలా కీలకం.. కేసీఆర్ వెనుకాల ఉండి ఆ ప్రాజెక్టు ను విజయవంతంగా పూర్తి చేశారు.. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వస్తే రాద్ధాంతం చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై నీళ్లు ఇచ్చిన కేసీఆర్ పై అబండాలు వేస్తున్నారు.. అందుకే అందరికి అర్థం అయ్యేలా చెప్పాలని నేను హరీష్ రావుకు చెప్పానని తెలిపారు. నీళ్ల విషయంలో కృష్ణా, గోదావరిలో ప్రతినీటి బొట్టును ఒడిసిపట్టి చుక్క నీటిని వదలకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కాలంతో పోటీపడి కట్టినం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని దాదాపు 90 శాతం పూర్తిచేసినం. సీతారామ ప్రాజెక్టును కూడా 90 శాతం పూర్తిచేసి తెలంగాణ రైతాంగం ప్రయోజనం కోసం కేసీఆర్ సర్కార్ నిరంతరం పనిచేసిందన్నారు.
హనీమూన్ కి బయలుదేరిన యువకుడు.. వాటర్ బాటిల్ కోసం ట్రైన్ దిగి.. చివరకు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విషాదం చోటుచేసుకుంది. హనీ మూన్ కి బయలుదేరిన యువకుడు ట్రైన్ కింద పడి మృతి చెందాడు. కదులుతున్న రైలును ఎక్కబోయి ప్రమాదవశాత్తు కిందపడి రైల్ కు ప్లాట్ ఫారంకు మధ్య ఇరుక్కొని తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు వరంగల్ కు చెందిన ఉరకొండ సాయి (28) గా పోలీసులు గుర్తించారు. సాయికి మూడు నెలల క్రితం వివాహం జరిగినట్లు తెలిపారు. హనీమూన్ కు గోవాకు వెళ్ళడం కోసం తన భార్య, బావమరిది, 4స్నేహితులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. వస్కోడిగామ ఎక్స్ ప్రెస్ రైల్ ఎక్కారు. రైలు కదలడంలో ఆలస్యం అవుతుండడంతో వాటర్ బాటిల్ కోసం సాయి కిందకు దిగాడు. సాయి తిరిగి వచ్చే లోపు ట్రైన్ కదలడంతో అందులో ఉన్న అతడి స్నేహితులు చైన్ లాగి రైలును ఆపారు. చైన్ లాగిన ఇద్దరు యువకులను కిందకు దింపి ప్రశ్నించిన రైల్వే పోలీసులు జరిమానా కట్టాలన్నారు.
ఢిల్లీ సీఎంను చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్.. తప్ప తాగి పెళ్లాంతో గొడవ పడి…
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాను బెదిరించిన వ్యక్తిని ఘజియాబాద్, ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందం అరెస్టు చేసింది. కొత్వాలి ప్రాంతం నుంచి శ్లోక్ త్రిపాఠి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అనంతరం అతన్ని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు తన భార్యతో గొడవపడి మద్యం మత్తులో ఉన్నప్పుడు ఫోన్ చేసి బెదిరించాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘజియాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాను చంపేస్తామని హెచ్చరించాడు. బెదిరింపులకు ఉపయోగించిన సిమ్ కార్డు గోరఖ్పూర్ చిరునామాతో నమోదు చేయబడింది. సిమ్ కార్డు నిందితుడి బంధువు పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను చంపేస్తానంటూ త్రిపాఠి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఘజియాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు.. ఆమెకు మరింత భద్రతను పెంచారు. కాల్ చేసిన దుండగుడు వెంటనే ఫోన్ స్విచ్చాఫ్ చేశాడని ఘజియాబాద్ డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ఆ సమాచారాన్ని ఢిల్లీ పోలీసులు, ముఖ్యమంత్రి భద్రతాధికారులకు చేరవేసినట్లు తెలిపారు. అనంతరం రంగంలోకి దిగిన బృందాలు నిందితుడిని కొనుగొన్నాయి.
అద్భుతమైన ప్రభుత్వ పథకం.. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం..!
దేశంలోని మహిళలను శక్తివంతం చేయడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక పథకాలను నిర్వహిస్తోంది. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతపై ఎక్కువ దృష్టి సారించింది. ఈ దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరంలో మహిళల కోసం లఖ్పతి దీదీ యోజనను ప్రారంభించింది. లఖ్పతి దీదీ యోజన అనేది నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం. దీని ద్వారా దేశంలోని సోదరీమణులందరికీ నైపుణ్య శిక్షణ ఇవ్వబడుతుంది. తద్వారా వారు స్వయంగా డబ్బు సంపాదించగలరు. ఈ పథకం కింద 2024-25 మధ్యంతర బడ్జెట్లో దాదాపు 3 కోట్ల మంది మహిళలకు రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహిళలకు వడ్డీ లేకుండా 5 లక్షల రూపాయల వరకు రుణం అందిస్తుంది. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, SHG సభ్యత్వ కార్డు, కులధ్రువీకరణ పత్రం, ఫోన్ నెంబర్, పాస్ఫొటో వంటి పత్రాలు అవసరం. మీరు ఈ స్కీమ్ ద్వారా రుణాన్ని పొందడానికి మీ జిల్లాలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని సందర్శించాలి. అక్కడ లఖ్పతి దీదీ పథకం ఫారమ్ తీసుకుని.. అందులో కావాల్సిన వివరాలను పొందుపరచాలి. తర్వాత కావాల్సిన డాక్యుమెంట్లను జత చేసి సంబంధిత అధికారులకు సబ్మిట్ చేయాలి. మీ దరఖాస్తు ఫారమ్ను అధికారులు పరిశీలించి.. అర్హులైతే వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేస్తారు.
కట్టలు తెంచుకున్న కోపం.. అంపైర్పై జైస్వాల్..
భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో భారత -ఏ జట్టు రెండు టెస్లు మ్యాచ్ ల అనధికారిక సిరీస్ ఆడుతుంది. ఈ పర్యటనలో తొలి మ్యాచ్ ఆడిన కేఎల్ రాహుల్ సెంచరీతో కదం తొక్కాడు. నిలకడగా ఆడుతూ 116 పరుగులతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 26 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 17 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎల్బీగా వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ వోక్స్ వేసిన బంతి జైస్వాల్ ఫ్యాడ్స్ కు తగిలింది. దాన్ని అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. కానీ అంపైర్ నిర్ణయంపై యశస్వి సంతృప్తి చెందలేదు. అంపైర్ ఔట్ ఇచ్చినా క్రీజు నుంచి బయటకు వెళ్ళలేదు. తాను నాటౌట్ అంటూ అంపైర్పై ఫైర్ అయ్యాడు. అంపైర్ మాత్రం అది కచ్చితంగా అవుట్ అని చెప్పడంతో చేసేదేం లేక మైదానం వీడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ అనధికారిక మ్యాచ్లో ధ్రువ్ జురెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సిరీస్లో జురెల్ వరుసగా మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కరుణ్ నాయర్ డబుల్ సెంచరీతో చితక్కొట్టాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకడంతో కేఎల్ రాహుల్ టెస్టుల్లో పర్మినెంట్గా ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు సెంచరీతో తన ఓపెనింగ్ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. భవిష్యత్తులో టెస్టులకు యశస్వి జైస్వాల్తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు.
అఫీషియల్ అనౌన్స్మెంట్ అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్లో దీపికా పదుకొనే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ ఎంటర్టైనర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అనౌన్స్మెంట్ నుంచే సినిమాపై అభిమానులకు ఆకాశాన్నంటేలా అంచనాలు ఏర్పడ్డాయి. సైన్స్ ఫిక్షన్, యాక్షన్-ఫాంటసీ జోనర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమాకు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించడానికి ప్రముఖ స్టూడియోలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్కి సంబంధించి సాలిడ్ అప్డేట్ను ఒక్కోక్కటిగా ప్రకటిస్తున్నారు మేకర్స్. ఇక ఈ మూవీలో కథానాయికగా ఇప్పటికి చాలా పేర్లు వినబడగా మొత్తనికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా దీపికా పాత్రను రివీల్ చేస్తూ స్పెషల్ వీడియోను పంచుకుంది.దీన్ని నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లేలా బాలీవుడ్ గ్లామరస్ క్వీన్ దీపికా పదుకొనె కూడా ఈ టీమ్తో జాయిన్ కావటం విశేషం. మొత్తానికి అమ్మడు లిస్ట్ లో మరో పాన్ ఇండియా మూవీ వచ్చి చేరింది.
ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లింగ్ ‘శంబాల’ టీజర్ రిలీజ్..
డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోతున్నాడు యంగ్ హీరో ఆది సాయి కుమార్. అతని ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యం చూపిస్తూ దూసుకుపోతున్న ఈ హీరో ప్రస్తుతం ఆడియెన్స్ను నూతన ప్రపంచంలోకి తీసుకెళ్లే ‘శంబాలా’ సినిమా చేస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్న దర్శకనిర్మాతలు.. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా టీజర్ వదిలారు. విరుపాక్ష, ఓదెల 2,పొలిమేర, పొలిమేర 2.. వంటి బ్లాక్ మ్యాజిక్ సినిమాలు ప్రేక్షకులను నుంచి ఎలాంటి ఆదరణ పొందాయి మనం చూశాం. కాగా ఈ ‘శంబాలా’ అంతకు మించి అనేలా ఉంది. టీజర్ లో ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఎక్కడ కూడా స్టోరీ లీక్ అవ్వకుండా టీజర్ ను హైలెట్గా కట్ చేశారు. ఒక్కోక సీన్ ఎంతో ఇంట్రెస్ట్గా క్రియేట్ చేశాడు దర్శకుడు. ఇక ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై, ఇదివరకెన్నడూ టచ్ చేయని పాయింట్తో తెరకెక్కిస్తున్న ఈ సూపర్ థ్రిల్లర్ను యుగంధర్ ముని హాలీవుడ్ స్థాయి నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని, హై టెక్నికల్ స్టాండర్డ్స్తో, గ్రాండ్ విజువల్స్తో రూపొందిస్తున్నారట. మొత్తానికి యంగ్ హీరో సాయి కుమార్ ఈ మూవీతో బారీ హిట్ కొట్టడం గ్యారెంటీ అనిపిస్తుంది.