
హైదరాబాద్, జూన్ 7: దంపతుల మధ్య గిల్లికజ్జాలు షరా మామూలే. ఆనక మళ్లీ గొడవ సర్దుమనిగి కలిపిపోతారు. ఇది ఎక్కడైనా సాధారణంగా కనిపించే సీన్. కానీ ఓ మొగుడి గారికి భార్యపై విపరీతంగా కోపం వచ్చింది. దీంతో భార్యతో గొడవకు దిగాడు. కాసేపు ఇద్దరు వాదులాడుకున్నాక.. భర్త అలిగి బయటికి వెళ్లిపోయాడు. కాసేపటికి ఫుల్లుగా మందేసి వచ్చాడు. అయితే వచ్చింది తన ఇంటికి కాదు. పక్కింటికి.. మద్యం మత్తులో పక్కింట్లోని యువతిని తన భార్యగా పొరబడి.. అప్పటికే తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెను పొడిచాడు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం (జూన్ 6) రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన సలీమ్ (60), రేష్మ దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. పిల్లల్లో ఒకరు మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. మరో కూతురు హైదరాబాద్ మైలార్దేవ్పల్లి డివిజన్లోని టీఎన్జీవోస్ కాలనీలో నివాసం ఉంటుంది. అయితే మూడేళ్ల క్రితం సలీమ్ దంపతులు హైదరాబాద్కి వచ్చి మైలార్దేవ్పల్లిలోని ఉద్డంగడ్డలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజువారీ కూలీ అయిన సలీం తన భార్య రేష్మతో కలిసి ఓ గది అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. ఈ జంట గది పక్కన, జేబేదా (26) అనే మహిళ కుటుంబంతో కలిసి నివసిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా సలీమ్ భార్యతో గొడవపడసాగాడు. ఈ క్రమంలో శుక్రవారం కూడా గొడవ పడ్డారు. బయటికి వెళ్లి ఫుల్లుగా మద్యం మత్తులో తన గది అనుకుని పక్కనే ఉన్న జుబేదా గదిలోకి వెళ్లాడు.
గదిలో నిద్రిస్తున్న జుబేదాను భార్యగా పొరబడి.. తనతో తెచ్చుకున్న కత్తితో ఆమె కడుపులో ఆమాంతం పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జుబేదా అక్కడే కుప్పకూలింది. గమనించిన స్థానికులు పోలీసులు సలీమ్ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు జుబేదాను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఈ ఘటనపై మైలార్దేవ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు మైయార్దేవ్పల్లి ఇన్స్పెక్టర్ పి. నరేందర్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.