చత్తీస్గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో జరుగుతున్న నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లో భద్రత బలగాలు తాజాగా గొప్ప విజయాన్ని సాధించాయి. తాజాగా ఐదుగురు మావోలు ఎన్కౌంటర్లో హతమయ్యారు. గత మూడు రోజులుగా నిరంతరం జరుగుతున్న ఆపరేషన్లో ఇప్పటివరకు ఏడుగురు నక్సలైట్లను బలగాలు మట్టుబెట్టాయి. వారిలో ఇద్దరు టాప్ కమాండర్లు ఉన్నారు. గత మూడు రోజుల్లో ఎదురుకాల్పుల్లో మరణించిన ఏడుగురిలో ఇద్దరిని గుర్తించగా మరో ఐదుగురి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లు బీజాపూర్ జిల్లా ఎస్పి జితేంద్ర యాదవ్ తెలిపారు. ఎన్కౌంటర్లో మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఎదురుకాల్పుల ఘటనపై బస్తర్ ఐజి సుందర్ రాజ్ ఎప్పటికప్పుడు ఆరాతీస్తున్నారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం. ఈ ఆపరేషన్లో నక్సలైట్ సుధాకర్పై రూ. కోటి బహుమతి,
తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆడేలు అలియాస్ భాస్కర్పై రూ.25 లక్షల రివార్డు ఉంది. వీరిద్దరూ మొదటి రెండు రోజుల్లోనే మరణించారు. మూడవ రోజు శనివారం జరిగిన ఆపరేషన్లో భద్రతా దళాలు మరో ఐదుగురు నక్సలైట్లను హతమార్చాయి. అయితే మరణించిన నక్సలైట్ల సంఖ్య దీని కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా, ఈ సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నేషనల్ పార్క్ ప్రాంతంలో శుక్రవారం రాత్రంతా కాల్పులు కొనసాగాయి. భద్రతా దళాల బృందాలు మొత్తం ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. అడవిలో దాక్కున్న నక్సలైట్ల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన ఆపరేషనల్లో ఆటోమెటిక్ రైఫిల్స్, పేలుడు పదార్థాలు, వైర్లెస్సెట్లు, బుల్లెట్ బెల్టులు, పెద్ద మొత్తంలో వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి.