
శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి సవిత అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. పెనుకొండ తహశీల్దార్ శ్రీదర్ ఇచ్చిన బొకేను మంత్రి సవిత విసిరికొట్టారు. సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. మంత్రి సవిత తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి బొకేను విసిరికొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఆంధ్రప్రదేశ్లో జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గం పరిధిలోని రేషన్ షాపుల్లో రేషన్ సరుకుల పంపిణీని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి సవిత.. పెనుకొండకు వెళ్లారు. అక్కడ తాహశీల్దార్ శ్రీధర్ మంత్రి సవిత చేతికి బొకేను అందించారు. ఈ క్రమంలో ఆమె సీరియస్గా దానిని వెనక్కి విసిరేశారు.
అలా విసిరేసిన బొకే కాస్తా.. గన్మన్ను తాకుతూ కిందకు పడిపోయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. మంత్రి అంత కోపం ఎందుకు వచ్చిందో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తహశీల్దార్ మీద ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారనేదీ తెసుకోవాలని ఉంది అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.