
Story board: ఏ రాష్ట్రానికైనా ఆర్థిక వ్యవస్థే కీలకం. ఓ రాష్ట్రం ప్రస్తుత పరిస్థితినే కాదు.. భవిష్యత్తును అంచనా వేయటానికి కూడా ఆర్థిక చక్రమే కీలక ప్రాతిపదిక. ఏటా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి కనిపిస్తుందా.. లేదా అనేది ప్రభుత్వాల పనితీరుకు అద్దం పడుతుంది. తెలంగాణలో ప్రస్తుత సర్కారు ఏర్పడి ఏడాదిన్నర పూర్తైంది. అలాగే ఏపీలోనూ కూటమి సర్కారు త్వరలో ఏడాది పూర్తిచేసుకుంటోంది. ఈ సమయంలో ఏ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏమిటి అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే ఓవరాల్ గా ఏ రాష్ట్రం ఆర్థిక స్థితి కూడా సంతృప్తికరంగా లేదనేది బహిరంగ రహస్యమే. ఏపీకి అప్పులు ఎక్కువగా ఉన్నా.. తెలంగాణకు ఆదాయం తగ్గకపోయినా.. మొత్తం మీద ఆర్థిక ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ఈ కారణంగానే రెండు ప్రభుత్వాలూ ఆర్థిక వనరుల సమీకరణపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తోంది. అటు అప్పులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలన్నా.. కొత్తగా అప్పులు చేయక తప్పని స్థితి ఉందని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు బహిరంగంగానే చెబుతున్నాయి. కొన్నిసార్లు బహిరంగ సభల్లో కూడా ఈ విషయాన్ని నేరుగా ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారు. ఆర్థిక పరిమితులున్నాయి.. వస్తున్న ఆదాయాన్ని బట్టి ఖర్చును నియంత్రించక తప్పదని తేల్చేస్తున్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల దగ్గర్నుంచి సామాన్యుల వరకు సర్కారును ఏం అడగాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది.
తెలుగు రాష్ట్రాల బడ్జెట్లు చూస్తే అక్షరాలా లక్షల కోట్ల లో ఉన్నాయి . ప్రతీ ఏడాది బడ్జెట్ అంకెలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ అభివృద్ధి మాత్రం చెప్పిన రేంజ్ లో కనపడటం లేదు. తెలుగు రాష్ట్రాల బడ్జెట్ పరిమాణానికి, ఖజానా పరిస్థితికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో హైలైట్ అయ్యాయి. అయినా సరే తెలంగాణ సర్కారు అసెంబ్లీలో 3 లక్షల 4 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో బడ్జెట్ను ప్రకటించారు. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, నీటి పారుదల వంటి ముఖ్యమైన రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. ఇదే సమయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 3 లక్షల 22 వేల 359 కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రకటించింది. అయితే, ఇందులో లక్ష కోట్ల రూపాయల లోటును కూడా చూపించారు. ప్రతి వారం ఏపీ సర్కారు రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పులు తెస్తోందనే ఆరోపణలు కూడా ేఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంపై 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయనే సమాచారం బయటకొస్తోంది.
తెలంగాణకూ ఇదే పరిస్థితి. అక్కడ కూడా అప్పులు 5 లక్షల 20 వేల కోట్ల రూపాయల వరకు ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వ ఆదాయం తక్కువగా ఉన్నా, ఖర్చులను తగ్గించలేని పరిస్థితి ఉంది. అందుకే, అప్పులు తీసుకోవాల్సిన అవసరం పడుతోంది. అయితే, ప్రతి ఏడాది భారీ బడ్జెట్లు పెట్టడమే సరైనదా? నిధులు వాస్తవంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంత పెద్ద బడ్జెట్లు ప్రకటించిన తర్వాత కేంద్రం వద్ద సాయం అడగడం సమంజసమేనా? అనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా, ప్రభుత్వాలు ఖజానా ఖాళీ అని చెబుతూనే, మరోవైపు భారీ బడ్జెట్లు చూపించడం ప్రజల్లో సందేహాలు రేకెత్తిస్తోంది
అసలు విషయం ఏమిటంటే బడ్జెట్లో ప్రకటించిన ప్రణాళికలు నిజంగా అమలు అవుతున్నాయా? కేటాయించిన నిధులు సరైన విధంగా ఖర్చవుతున్నాయా? అనే విషయాలు కూడా తేలాల్సి ఉంది. అనుకున్న ప్రణాళికలు నిజంగా అమలు అయితేనే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. కానీ ఆ లెక్కలు కేవలం కాగితాల వరకు మాత్రమే పరిమితం అయితే .. ఏ రాష్ట్రం అభివృద్ధి చెందడం అనేది కలగానే మిగిలిపోతుంది.
అలాగని తెలుగు రాష్ట్రాలు పనితీరు విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. సంప్రదాయంగా బలం ఉన్న ప్రాతిపదికల్లో ఎక్కడా వెనుకబడటం లేదు. ఆర్థికంగా తీసుకునే కీలక ప్రాతిపదికల్లోనూ సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలోనూ తమకు సాటి రాగల రాష్ట్రాలు దేశంలోనే లేవని నిరూపించాయి. దేశంలో అత్యల్ప ద్రవ్యోల్బణం నమోదు అయిన రాష్ట్రాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు టాప్ లేపాయి. అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పగా.. దానిని అనుసరించిన ఆంధ్ర ప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. వెరసి దేశంలోనే అత్యల్ప వస్తు, సేవల ధరలు కలిగిన రాష్ట్రాలుగా తెలుగు రాష్ట్రాలు కొత్త చరిత్రను లిఖించాయి. తెలుగు రాష్ట్రాలకు ఆర్థికంగా కొన్ని సానుకూలతలున్నా.. ఓవరాల్ గా అప్పుల కొండ పెరిగిపోతోందనే ఆందోళన కనిపిస్తోంది. ఎవరేమనుకున్నా.. తాము అప్పు చేసి సంపద సృష్టిస్తున్నామనే చెప్పుకుంటాయి ప్రభుత్వాలు. కానీ ఓ సారి ప్రభుత్వం మారాక.. గత సర్కారు తెచ్చిన అప్పులతో పైసా ఆస్తి సృష్టించలేదని కొత్త ప్రభుత్వం చెబుతోంది. ఈ సీరియల్ అలా నడుస్తూనే ఉంటుంది. ఇటు జనానికి ఎప్పటిలాగే ఎవరిదో నిజమో అంతుబట్టదు. మరీ ఎక్కువ లోతుకు వెళ్తే అంత తేలికగా అర్థమయ్యే విషయం కూడా కాదు. అసలే మింగుడు పడని సబ్జెక్టు. అయినా సరే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ సబ్జెక్టు అర్థం చేసుకోవాల్సిన అవసరం రెండు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఎందుకంటే పెరుగుతున్న అప్పులు అంతిమంగా ప్రజలకే బదిలీ అవుతాయి.
ఏ ఆర్థిక వ్యవస్థకైనా, వనరులకూ అవసరాలకూ పొంతన కుదరనప్పుడు, వనరులను మించి అవసరాలు ఉన్నప్పుడు ఆ కొరతను పూడ్చుకోవడానికి అప్పు అవసరమవుతుంది. కనుక అప్పు దానికదిగా తప్పు కాదు. కాని ఆ అప్పు అవసరం గుర్తించాలంటే ముందు మన వనరులేమిటి, మన అవసరాలేమిటి, మన వనరులను సక్రమంగానే, సమర్థంగానే వినియోగిస్తున్నామా, మన అవసరాలను సరిగానే అంచనా వేస్తున్నామా, అవసరం లేని ఖర్చులూ దుబారా ఖర్చులూ చేస్తున్నామా వంటి ఎన్నో విషయాలపై అవగాహన తెచ్చుకోవాలి. అప్పుకు వెళ్లకుండా మన అవసరాలను మన వనరుల లోపల తీర్చుకోగలమా లేదా అని ప్రభుత్వాలు ఆలోచించడం లేదు. ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహించాలి. పౌరులకు ఆదర్శంగా నిలబడాల్సిన ప్రభుత్వాలే ఎడాపెడా అప్పులు చేసుకుంటూ పోతున్నాయని కాగ్ ఆక్షేపించింది. బడ్జెట్లోటు ఎక్కువగా ఉండి అప్పులు పుట్టని పక్షంలో కేంద్రం డెఫిసిట్ ఫైనాన్సింగ్ కింద కరెన్సీని ప్రింట్ చేసుకొని చలామణీలోకి తీసుకురాగలదు. కానీ, రాష్ట్రాలకు ఆ అవకాశం కూడా లేదు. అన్ని రాష్ట్రాల మొత్తం నిధుల్లో 2016-17లో అభివృద్ధి పనులకు 67.6శాతం వెచ్చిస్తే, 2022-23లో అది 63శాతానికి పడిపోయింది. అభివృద్ధేతర కార్యక్రమాలకు వెచ్చించిన సొమ్ము 2004-05లో కేవలం రూ.1.85 లక్షల కోట్లు. అదే 2022-23 నాటికి అది రూ.14.18 లక్షల కోట్లకు చేరినట్లు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై నివేదికలో రిజర్వు బ్యాంకు వెల్లడించింది. ఇక్కడ ప్రణాళిక వ్యయం కంటే.. ప్రణాళికేతర వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరగడం కూడా ఆందోళన కలిగిస్తున్న విషయమే. ఎడాపెడా ఇస్తున్న ఎన్నికల హామీలు, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ కలిసి.. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. పైగా ఆర్థిక వ్యూహం ఎప్పుడూ డైనమిక్ గా ఉండాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం మార్చుకోవాలి. కానీ సర్కారుకు ఐదేళ్ల కాలపరిమితి ఉంది కాబట్టి.. ఆ ఐదేళ్లూ ఒకే వ్యూహంతో ఉంటామంటే కుదిరేపని కాదు. ప్రపంచీకరణ తర్వాత గ్లోబల్ పరిణామాలు కూడా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. స్థానిక సమస్యల్ని పరిష్కరించుకుంటూనే.. జాతీయ, అంతర్జాతీయ పరిణామాల్ని గమనిస్తూ.. తగిన ఆర్థిక వ్యూహం సిద్ధం చేసుకోవాలి. అప్పుడే ఏ రాష్ట్రానికైనా ఆర్థికంగా ఢోకా లేకుండా ఉంటుంది. ఏ రాష్ట్రానికి ఎంత అప్పుందనేది బహిరంగ రహస్యమే కాబట్టి.. ఆ విషయంలో పరిష్కార మార్గాలు ఏమిటా అని నిరంతరం ఆలోచించాలి.
మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలది ప్రస్తుతానికి ఒకటే పరిస్థితి. విభజన సమయంలో తెలంగాణ రెవిన్యూ మిగులుతో ఉంటే.. ఏపీ ఆర్థిక లోటుతోనే ప్రయాణం మొదలుపెట్టాయి. కాల క్రమంలో చాలా పరిణామాలు జరిగాయి. పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలూ అభివృద్ధి, సంక్షేమం విషయంలో పోటీపడ్డాయి. ఏ రాష్ట్రంలో ఎందుకు అప్పులు చేశారు.. ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగిందనే విషయం పక్కనపెడితే.. ఇప్పుడు రెండు రాష్ట్రాలూ ఉమ్మడి మజిలీకి చేరుకున్నాయి. మొదట ఏం చేయాలన్నా చేతిలో డబ్బులుండాలి. మరీ నిధుల కటకట లేకుండా.. కనీస అవసరాలకైనా కాస్త డబ్బు ఆడుతుంటే.. అప్పుడు ఆర్థిక సమస్యలు తీర్చుకోవడంపై దృష్టి సారించటానికి ప్రభుత్వాలకు అవకాశం ఉంటుంది. అలాకాకుండా మరీ ఆర్థిక స్థితి టైట్ గా ఉంటే.. ప్రతి క్షణం డబ్బులెలా వస్తాయా అనే ఆలోచనతోనే సరిపోతుంది. మిగతా అంశాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టే అవకాశం ఉండదు. అందుకే ఆర్థికవేత్తలు కూడా వీలైనంత త్వరగా అప్పుల భారం నుంచి బయటపడమనే సలహా ఇస్తారు.
నిజానికి ఆర్థిక వ్యవస్థను మేనేజ్ చేయడంలో తెలుగు రాష్ట్రాలకు మంచి పేరుంది. అయితే అనూహ్యంగా వచ్చి పడుతున్న ఖర్చులు, అనుకోకుండా పెరుగుతున్న హామీలే.. పుట్టి ముంచుతున్నాయి. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వక తప్పడం లేదనేది ప్రతి పార్టీ చెప్పే మాట. అందుకని హామీలు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నారు. ఒకర్ని మించి మరొకరు హామీ ఇచ్చి.. ఏదోలా అమలు చేసే ఉద్దేశంతో అప్పులు చేస్తున్నారు. ఆదాయం పెంచటానికి మార్గాలు చూడటం లేదని ఎవరూ అనడం లేదు. ఆ విషయంలోనూ ఎవరి కష్టం వారు పడుతున్నారు. అయితే అప్పు చేసినంత తేలికగా ఆదాయం పెంచడం ఎప్పుడూ సాధ్యం కాదు. ఇక్కడే చిక్కుముడి పడుతోంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అప్పు చేయకుండా బండి లాగించటానికే ప్రయత్నిస్తుంది. కానీ తప్పనిసరిగా నెరవేర్చాల్సిన బాధ్యతలు, పెరుగుతున్న ప్రజల ఆకాంక్షలు, తప్పనిసరి పథకాలు. అభివృద్ధి వంటి కారణాలతో అప్పులు చేయాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు వినూత్న వ్యూహాలతో ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించే ప్రయత్నం చేస్తున్న తెలుగు రాష్ట్రాలు.. వీలైనంత త్వరగా అప్పులు తగ్గించుకోవాలని చూస్తున్నా.. పరిస్థితులు సహకరిస్తాయా.. లేదా అనేది చూడాల్సి ఉంది.