మద్యం మత్తులో విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై దాడి చేసిన ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్టు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి కల్లూరులో చోటుచేసుకుంది. తల్లాడ గ్రామానికి చెందిన రాయల రామారావు అలియాస్ రాముతోపాటు కొంతమంది యువకులు శుక్రవారం సాయంత్రం మద్యం మత్తులో కల్లూరు ఎన్ఎస్పి క్రాస్ రోడ్డులోని చౌదరి హోటల్ వద్దకు వచ్చి గొడవ చేస్తున్నారని హోటల్ యజమాని మాగంటి బోసుబాబు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినట్లయితే ఇబ్బందులకు గురిచేస్తానని, హోటల్ నడవనివ్వబోనని గొడవలో సాక్షులుగా ఉన్న హోటల్ సిబ్బందిని, తనను బెదిరించాడని పేర్కొన్నారు. అంతేకాకుండా హోటల్ ముందు కుర్చీ వేసుకుని కూర్చుని న్యూసెన్స్ చేస్తున్నాడనే సమాచారంతో ఇచ్చారు.
దీంతో కేసు నమోదు చేసి, విచారణ నిమిత్తం ఘటనా స్థలానికి మహిళా ఎస్ఐ హరిత తన సిబ్బందితో హోటల్ వద్దకు వెళ్లారు. ఆమె ఎదురుగానే రాయల రామారావు అలియాస్ రాముతో పాటు అతని అనుచరులు గొడవకు దిగారు. వారిని అక్కడి నుండి పంపించే క్రమంలో రాయల రామారావు, అతని అనుచరులు పోలీసుల విధులకు ఆటంకం కల్పిస్తూ దౌర్జన్యంగా దాడి చేసి బెదిరింపులకు దిగారు. ఒకదశలో రాయల రామారావు మహిళా ఎస్ఐ పట్ల అనుచితంగా వ్యవహ రించాడు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం పది మందిపై కేసు నమోదు కాగా ప్రధాన నిందితుడు రాయల రామారావుతో పాటు మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాగా, గతంలో రాయల రామారావుపై తల్లాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని పోలీస్ కమిషనర్ తెలిపారు.