
ఏంటీ దారుణం..టెక్ యుగంలో కూడా ఇంకా అనాగరిక పోకడలా.? కుల విద్వేషాలా? మనిషిని మనిషిగా చూసే తత్వం ఇంకెప్పుడు..? ఇంకా అణగారిన వర్గాలపై పెత్తనపు పోకడలా? కర్ణాటకలో ముగ్గురు దళిత బాలురను స్తంభానికి కట్టేసి 60 మంది కొట్టిన ఘటన అందరిని కలచివేస్తోంది. ఇలాంటి అమానుష ఘటనలు సమాజంలో వివక్ష, హింస ఇంకా ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేస్తున్నాయి.
కర్ణాటకలోని గడగ్ జిల్లాలోని హరోగిరిలో కుల విద్వేషం మరోసారి కత్తులు నూరింది. మే 28న హరోగిరిలో 60 మందితో కూడిన గుంపు ముగ్గురు దళిత మైనర్ బాలురలను స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. అగ్రకులస్థుల గుంపు దళిత బాలురపై దాడి చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటక వ్యాప్తంగా ఆగ్రహావేశాలు చెలరేగాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ బాలురు అగ్ర కులానికి చెందిన అమ్మాయికి అసభ్యకరమైన మేసేజ్ లు పంపించారనే ఆరోపణలతో ఓ గుంపు వారిని గ్రామ పంచాయతీ జెండా స్తంభానికి కట్టివేసి, తాళ్లు, చెప్పులు, కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ దాడి తర్వాత వారిలో బాధితుల్లో ఒకరు ఆత్మహత్యాయత్నం చేయడంతో వివాదం మరింత ముదిరింది.
సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికిచేరుకొని భద్రత పెంచారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు 12మందిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో చాలా మందిపరారీలో ఉన్నారని నర్గుండ్ సీఐ తెలిపారు.
►ALSO READ | ఆర్సీబీ ఈవెంట్ మేనేజ్మెంట్ సభ్యుల అరెస్ట్
ఈ ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు 30 మందిని నిందితులుగా పేర్కొంటూ పోక్సో చట్టం కింద ప్రత్యేక కేసు నమోదు చేశారు. తమ పిల్లలను విడిపించేందుకు వచ్చినప్పుడుతమను కూడా బెదిరించి గ్రామం నుంచి వెళ్లగొట్టారని బాధితుల తల్లిదండ్రులు, బంధవులు చెప్పారు.
“మా గ్రామంలో ఇంకా అంటరానితనం కొనసాగుతోంది. మేం రోజూ వివక్షకు గురవుతున్నాం. ఈ సంఘటన దానికి ఒక భయంకరమైన ఉదాహరణ” అని బాధితుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఈ దాడిలో గాయపడిన ఓ మైనర్ బాధితుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషం తాగడంతో పరిస్థితి విషమించి హుబ్లిలోని KIMS ఆసుపత్రిలో చేరాడు.
స్థానిక వర్గాల సమాచారం ప్రకారం..మొదట్లో ఈ విషయాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. కొంతమంది సంఘ నాయకులు రాజీకి కూడా ప్రయత్నించారు. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.