హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా కారణంగా వాహనాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. దీంతో వాయు కాలుష్యం నుంచి నగరాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా పెట్రోల్, డీజిల్ లేని 65 వేల కొత్త త్రీ వీలర్ ఆటో రిక్షాలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో కొంతకాలంగా కొత్త ఆటో రిక్షాలకు పరిమితి ఉంది. అయితే కొత్త ఆటో రిక్షాలకు పరిమిట్లు ఇవ్వడానికి లేదు. దీంతో ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ జీవో నెంబర్ 263 విడుదల చేసింది. హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న జనాభా, ఓఆర్ఆర్ లోపల ఏర్పడిన కొత్త లే అవుట్లు, అపార్ట్మెంట్ల ఫలితంగా పట్టణీకరణపై వివిధ సవాళ్లు తలెత్తాయి.
ముఖ్యంగా నగరంలో జనాభా అపారమైన పెరుగుదల కారణంగా ఆటో రిక్షా పర్మిట్లకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ వాహనాలకు సంబంధించిన ఆటోలకు రెట్రో ఫిట్మెంట్ చేసి వాటి ఇంజిన్ను ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ లాగా మార్చుకోవడానికి 25 వేల వాహనాలకు అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పటివరకు ఉన్న డీజిల్, పెట్రోల్ ఆటో రిక్షాల ట్రాన్స్ఫర్, డీజిల్, పెట్రోల్తో నడిచే కొత్త ఆటో రిక్షాలకు ఓఆర్ఆర్ పరిధిలో అనుమతించబడవు అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. డిమాండ్ కు తగ్గట్లుగా ప్రజా రవాణాను మెరుగు పరుస్తూనే నగర కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
65 వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ఆదేశాలతో 65 వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. ఓఆర్ఆర్ లోపల కొత్త ఆటోలకు పరిమిత సంఖ్యలో అనుమతిస్తూ రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసిందని, ఈ మేరకు ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలకు అనుమతిస్తూ జీవో 263 విడుదల చేసినట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఓఆర్ఆర్ లోపల కొత్తగా 20 వేల ఎలక్ట్రిక్, 10 వేల ఎల్పీజీ ఆటోలకు అనుమతిస్తున్నామని వివరించారు. 10 వేల సీఎన్జీ ఆటోలకు అనుమతిస్తున్నామని వెల్లడించారు. 25 వేల డీజిల్, పెట్రోల్ ఆటోలకు రెట్రో ఫిట్మెంట్ చేయడానికి అనుమతిస్తు ఇస్తున్నట్లు తెలిపారు. 25 వేల ఆటోలను ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీలుగా మార్చడానికి అనుమతిచ్చామన్నారు.