. 4 minutes
Top Headlines 9 Am 7th June 2025

జలవనరుల శాఖపై సమీక్ష.. సీఎం కీలక ఆదేశాలు..
కృష్ణా, గోదావరి డెల్టాలో పంటల సాగు వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాన్లు కంటే ముందుగానే పంటలు చేతికొచ్చేలా పంటల సాగు కాలంలో మార్పులు తీసుకురావాలని సూచన చేశారు. భూగర్భ జలాలు పెంచడం, రిజర్వాయర్లు నింపడం, జలవనరుల సమర్ధ వినియోగం.. ఈ 3 అంశాలపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. 365 రోజులు భూమి పచ్చగా ఉండేలా… 3 పంటలు నిరంతరం పండించేలా చూడాలన్నారు. భూగర్భ జలాల వివరాలు తెలుసుకునేందుకు ఉపయోగించే పిజియో మీటర్లు, రాష్ట్రంలో కొన్ని చోట్ల పనిచేయకపోవడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు..

ఎవ్వరికీ రక్షణ, భద్రత లేదు.. రాష్ట్రంలో అత్యంత భయానక పరిస్థితులు..!
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రభుత్వాన్ని నిలదీస్తూ దీనిపై సోషల్‌ మీడియాలో వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. రాజకీయ కక్షలతో చంద్రబాబు, ఆయన పార్టీనాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా.. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది. అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అధికారంలో ఉన్నవారు అహంకారం, రౌడీయిజంతో చెలరేగిపోయి, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఫలితంగా జరుగుతున్న ఘటనలు అత్యంత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. అధికార పార్టీ పోలీసు యంత్రాంగాన్ని ఏ రకంగా అదుపాజ్ఞల్లోకి తీసుకుందో చెప్పడానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు జగన్‌.

టీడీపీలో మరోసారి రచ్చకెక్కిన విభేదాలు..
అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ అసెంబ్లీ ఇంఛార్జ్‌ పోస్టు.. బత్యాల చెంగల రాయుడు కు ఇవ్వాలని శుక్రవారం సాయంత్రం మోకాళ్లపై కూర్చొని నినాదాలు చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నిరసన వ్యక్తం చేశారు. రాజంపేట పద్మ ప్రియ కళ్యాణ మండపంలో నియోజకవర్గ టీడీపీ బత్యాల వర్గీయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బత్యాల చెంగలరాయుడు వర్గీయులు ఈ డిమాండ్ చేశారు. బత్యాల చంగల్ రాయుడు శ్రమను అధిష్టానం గుర్తించాలని కోరారు. రాజంపేట తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ కోవర్డులు చొరపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజంపేటలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవ డానికి ఈ వైసీపీ కోవర్టులే కారణం అని ఆరోపించారు. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్‌ నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు పలకడం లేదని ఆరోపించారు. నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారన్నారు. పార్లమెంట్ అధ్యక్షుడికి రాజంపేటలో ఏం పని, ఇంఛార్జ్‌ పదవితో నీకేం అవసరం అని చమర్తి జగన్మోహన్ రాజు నుద్దేశించి పరోక్షంగా ప్రశ్నించారు. దీంతో, రాజంపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి రచ్చకెక్కినట్టు అయ్యింది.

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం యోగి.. ముస్లిం సోదరులకు కీలక సందేశం..!
ఈద్-ఉల్-అఝా(బక్రీద్) పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముస్లి సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ త్యాగం, అంకితభావం, అల్లాహ్‌పై అచంచల విశ్వాసానికి ప్రతీక అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఈద్-ఉల్-అఝా పండుగ మనం కలిసి జీవించడానికి, సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రేరేపిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ పండుగ పరస్పర సోదరభావాన్ని పెంపొందించడానికి, సమాజంలో ప్రేమ, కరుణ, త్యాగ స్ఫూర్తిని బలోపేతం చేయడానికి ఒక అవకాశమని స్పష్టం చేశారు. యోగి ఆదిత్యనాథ్ శాంతి, సామరస్యంతో.. నియమాలను పాటిస్తూ పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. పండుగ సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, పరిశుభ్రత వ్యవస్థ సజావుగా నిర్వహించాలని పరిపాలనను ఆదేశించారు.

అమెరికాలో కొత్త పార్టీ.. మస్క్‌ వాదనకు 80% మద్దతు..!
టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహానికి కళ్లెం పడింది. ప్రస్తుతం ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇంతలో అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరం గురించి మస్క్ ఓ ప్రకటన చేశారు. వాస్తవానికి.. ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోల్ నిర్వహించారు. అందులో అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలా వద్దా అని అడిగారు. తాజాగా ఈ పోల్ ఫలితాలను మస్క్ వెల్లడించారు. 80% మంది ప్రజలు మద్దతుగా ఓటు వేశారని ట్రంప్ పేర్కొన్నారు. “అమెరికాలో 80% మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి ఒక కొత్త రాజకీయ పార్టీ అవసరం! సరిగ్గా 80% మంది దీనితో ఏకీభవిస్తున్నారు.” అని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌లో ‘ది అమెరికా పార్టీ’ అని టైటిల్ పెట్టారు. సోషల్ మీడియాలో మస్క్, ట్రంప్ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతున్న సమయంలో మస్‌ ఈ చర్చ తీసుకురావడం సంచలనంగా మారింది.

గోల్డ్ లోన్ కోసం ఆర్‌బిఐ కొత్త రూల్స్.. ఇప్పుడు బంగారం విలువలో ఎంత శాతం రుణం పొందొచ్చంటే?
ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో తమ వద్ద ఉన్న బంగారాన్ని తనఖా పెట్టి లోన్ తీసుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లోన్స్ అందిస్తుంటాయి. అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ లోన్స్ పై కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. రుణగ్రహీతలు ఇప్పుడు తాకట్టు పెట్టిన బంగారం విలువలో 85%కి సమానమైన రుణాలను పొందవచ్చని తెలిపింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉన్న బంగారు రుణాలపై ఉపశమనం ప్రకటించారు. ద్రవ్య విధాన సమీక్ష సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడిన ఆర్‌బిఐ గవర్నర్, రూ. 2.5 లక్షల వరకు బంగారు రుణాలపై లోన్-టు-వాల్యూ (ఎల్‌టివి) నిష్పత్తిని 85%కి పెంచుతున్నామని, అయితే ఈ మొత్తంలో వడ్డీ మొత్తం కూడా ఉంటుందని అన్నారు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 80 శాతం, రూ.5 లక్షలు దాటిన రుణాలకు 75శాతంగా నిర్ణయించింది. గతంలో రుణ మొత్తం తాకట్టు పెట్టిన బంగారం విలువలో 75% మించకూడదని ముసాయిదా ప్రతిపాదించింది. ఎవరైన బంగారం బిల్లు లేకపోయినా, వారు ఇప్పటికీ బంగారు రుణం పొందగలరని కూడా ఆయన తెలిపారు. దీని కోసం రుణ గ్రహీత డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

విరాట్ కోహ్లీపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు..
చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనకు విరాట్ కోహ్లీ కూడా కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు అందింది. కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్లో రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్‌ ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేయాలని కోరారు. ఇప్పటికే ఈ ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోషియేషన్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. విరాట్ కోహ్లీ పేరుతో వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాగా.. బెంగళూరు తొక్కిసలాట ఘటనలో అధికారులపై చర్యలు కొనసాగుతున్నాయి. కర్ణాటక ఇంటెలిజెన్స్ చీఫ్ హేమంత్ నింబాల్కర్‌ని బదిలీ చేశారు. హేమంత్‌తో పాటు పలువురు పోలీస్ అధికారులపై బదిలీ వేటు పడింది. తొక్కిసలాట ఘటనలో అరెస్టు అయినా నలుగురిని రిమాండ్‌కు పంపారు. వారికి ప్రత్యేక సెషన్స్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్‌ నిఖిల్‌ సోసాలే.. డీఎన్‌ఏ సంస్థకు చెందిన ముగ్గురికి రిమాండ్‌ విధిస్తూ తీర్పు వెలువరించింది.

‘కన్నప్ప’ కు కొత్త కష్టాలు.. బ్రాహ్మణ సంఘాల షాక్
టాలీవుడ్‌ యాక్టర్‌ మంచు విష్ణు నటిస్తోన్న బారీ చిత్రం ‘కన్నప్ప’. బాలీవుడ్‌ డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో గ్లోబల్‌ స్టార్ ప్రభాస్‌, మోహన్‌బాబు, మోహన్‌ లాల్‌, నయనతార, మధుబాల, శరత్‌కుమార్‌, శివరాజ్‌కుమార్‌, ఐశ్వర్య కీలక పాత్రలు పోషిటిస్తున్నారు. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పటికే మేకర్స్‌ ఈ మూవీ నుంచి లాంచ్‌ చేసిన టీజర్‌, పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. తాజాగా ఈ మూవీలో పిలక గిలక అనే హ‌స్య పాత్రల్లో న‌టించిన‌ బ్రహ్మానందం, స‌ప్తగిరిల‌కు సంబంధించిన పోస్టరు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాల్లో బాగా వైర‌ల్ అవడంతో పాటుగా కొత్త తలనొప్పి కూడా తెచ్చిపెట్టింది. ఈ పిలక గిలక పాత్రలపై బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు ‘కన్నప్ప’ సినిమాలో లేవని సినీనటులు మోహన్ బాబు, విష్ణు స్పష్టం చేయాలని’ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ డిమాండ్ చేశారు. గుంటూరు లో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.. ‘సనాతన ధర్మాన్ని, హిందూ మత విశ్వాసాలను బతికిస్తున్న బ్రాహ్మణ జాతి సంప్రదాయం, సంస్కృతి, ఆచారాలను మంచు కుటుంబం అవహేళన చేస్తుంది. ‘కన్నప్ప’ సినిమాలో పిలక-గిలక అనే పాత్రలు పెట్టి బ్రాహ్మణ జాతిని మళ్లీ అవమానించారు. దేనికైనా రెడీ సినిమాలో కూడా అదేవిధంగా బ్రాహ్మణులను అవమానించారు, తాము అప్పట్లో హైకోర్టులో రిట్ వేయగా మూడు సన్నివేశాలు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది’ అంటూ తెలిపారు. ప్రజంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

రెండు డిజాస్టర్ నుంచి తప్పించుకున్న దుల్కర్..
మలయాళ నటుడు అయినప్పటికి దుల్కర్ సల్మాన్‌కు తెలుగులోనూ ఎంత మంచి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. ‘మహానటి’,‘సీతారామం’ రీసెంట్‌గా ‘లక్కీ భాస్కర్’ వంటి మూవీతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకున్నాడు. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్‌గా ‘లక్కీ భాస్కర్’ మంచి వసూళ్లను రాబట్టింది. అయితే, ఈ హీరో ఓ రెండు భారీ డిజాస్టర్ చిత్రాల నుంచి తప్పించుకున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ రెండు చిత్రాలు కూడా హీరో కమల్ హాసన్‌వే కావడం. అవును కమల్ నటించిన ‘ఇండియన్-2’ సినిమాలో సిద్ధార్థ్ చేసిన పాత్రకు తొలుత దుల్కర్‌ను తీసుకున్నారు. కానీ, ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో సిద్ధార్థ్ నటించాడు. ఇక ఆ సినిమా ఎలాంటి టాక్‌తో నిలిచిందో అందరికీ తెలిసిందే. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ‘థగ్ లైఫ్’ లోనూ శింబు చేసిన పాత్ర కోసం దుల్కర్‌ను సంప్రదించారట. కానీ, ఆయన ఈ ఆఫర్‌ని రిజెక్ట్ చేశాడట. ఇక ఈ సినిమాకు దారుణమైన రిజల్ట్ వస్తుండడంతో, ఇది కూడా మరో ‘ఇండియన్-2’ మూవీగా అవతరించనుందని విమర్శకులు అంటున్నారు. దీంతో దుల్కర్ ఈ రెండు కళాఖండాల నుంచి తప్పించుకోవడం నిజంగా అతని లక్కీ అని చెప్పాలి.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.