
- హాస్పిటల్లో చికిత్స పొందుతూ బాలుడు మృతి
- జవహర్ నగర్ పరిధిలో ఘటన
కుషాయిగూడ, వెలుగు: తన లవర్తో ఎందుకు మాట్లాడుతున్నావని ఓ బాలుడిని మాజీ ప్రియుడి గ్యాంగ్ దారుణంగా కొట్టి చంపింది. జవహర్ నగర్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని ప్రగతి నగర్ సమీపంలో 16 ఏండ్ల బాలుడు అయాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. గురువారం సాయంత్రం ఓ యువకుడు అయాన్ కు కాల్ చేసి, తన లవర్తో ఎందుకు మాట్లాడుతున్నావని బూతులు తిట్టాడు. మాట్లాడుకుందామని చెప్పి రాధికా థియేటర్ సమీపానికి పిలిచాడు.
అక్కడికి చేరుకున్న బాలుడిపై మరికొంత మంది యువకులు కలిసి తీవ్రంగా దాడి చేసి బైక్లపై వెళ్లిపోయారు. బాధితుడిని గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇచ్చి, కాప్రాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందగా, డాక్టర్లు కుషాయిగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాలుడి డెడ్బాడీని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. అయాన్ పై దాడి చేసిన వారిలో ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.