చత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన మరో కీలక నేత మృతి చెందాడు. బీజాపూర్ జిల్లా, నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య గురువారం నుంచి భీకర పోరు కొనసాగిన విషయం తెలిసిందే. కూంబింగ్ కొనసాగింపు నేపథ్యంలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందాడు. ఘటనా స్థలంలో ఎకె -47 ఆయుధాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు చత్తీస్ గఢ్ పోలీసులు ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా, బోథ్ మండలం, ఉరుమడ్ల గ్రామానికి చెందిన భాస్కర్ 1995 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని అసలు పేరు మందుగుల భాస్కర్ రావు. ఆయన తండ్రి దుర్గయ్య సిపిఐ (మావోయిస్ట్) తెలంగాణ రాష్ట్ర కమిటీ మంచిర్యాల-కొమరం భీం (ఎంకెబి) డివిజన్ కార్యదర్శిగా పనిచేశారు.
భాస్కర్ ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యునికి పనిచేస్తున్నారు. అతనిపై చత్తీస్గఢ్లో రూ.25 లక్షలు, తెలంగాణలో రూ.20 లక్షలు – మొత్తం 45 లక్షల రివార్డ్ ఉంది. తెలంగాణాలో మావోయిస్ట్ పార్టీని బలోపేతం చేసేందుకు భాస్కర్ కీలకంగా పనిచేశారు. అయితే అతని యత్నాలను తెలంగాణ పోలీసులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టారు. ప్రస్తుతం భాస్కర్ వయసు 53 సంవత్సరాలు. పార్టీని బలోపేతం చేయడానికి , ఎక్కువ మంది విప్లవ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేటట్లు కృషి చేశాడు. ఆయనపై పోలీసులు నిఘా వేసిన నేపథ్యంలో 2020లో ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన కూంబింగ్ ఆపరేషన్ సమయంలో తిర్యాణి మండల అడవులలో మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు ప్రధాన నాయకులు, ముగ్గురు కార్యకర్తలు పోలీసుల వలకు చిక్కకుండా తప్పించుకోగలిగారు. గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి చెందిన విషయం తెలిసిందే.
అంతకుముందు గత నెల 21వ తేదీన జరిగిన మరో భారీ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు మరణించారు. గడిచిన 17 రోజుల వ్యవధిలోనే ముగ్గురు ముఖ్యనేతలు ఎన్కౌంటర్లో మృతి చెందిన ఘటనలు ఆ పార్టీకి భారీ నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. కాగా, నేషనల్ పార్కు సమీపంలో ఇతర మావోయిస్టు కార్యకర్తల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.