ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కార్యరూపం
తొలివిడతలో హైదరాబాద్లోని 16
మురికివాడల్లో అమలు త్వరలో
మిగతా పట్టణాలకు పథకం విస్తరణ
సమీక్షా సమావేశంలో రెవెన్యూ మంత్రి
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు, పేదలు నివసించే ప్రాంతాల్లో జీవనోపాధికి ఆటంకం లేకుండా జీ+3 మోడల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. త ద్వారా పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల పథకం కార్యరూపం దాల్చనుంది. అందులో భాగంగా శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల్ల నిర్మాణానికి సంబంధించి అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ హైదరాబాద్కు దూరంగా గత ప్రభుత్వం 42 వేల ఇళ్లను నిర్మించగా సుమా రు 19 వేల మంది మాత్రమే అక్కడికి వెళ్లారని, ఇటీవల క్షేత్రస్థాయిలో మరోసారి అధికారులు అక్కడకు వెళ్లి పరిశీలన జరపగా కేవలం 13 వేల మంది మాత్రమే ఆ నివాసాల్లో ఉంటున్నట్లు తేలిందన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా నగరంలోని మురికివాడల్లో పేదలు ఉన్నచోటే జి+3 పద్దతిలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా తొలివిడతలో హైదరాబాద్లో 16 మురికివాడలను గుర్తించామని అలాగే వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్గొండ కరీంనగర్ తదితర పట్టణాల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు.
గిరిజనులకు ప్రత్యేకంగా 22 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్టు ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో భద్రాచలం, ఉట్నూరు, ఏటూరునాగారం, మున్ననూరు ఐటిడిఎ పరిధిలోని చెంచు, కొలం, తోటి, కొండరెడ్ల గిరిజనుల కోసం 13,266 ఇళ్లను మంజూరు చేశామన్నారు అంతేకాకుండా రాష్ట్రంలోని 16 ఎస్టీ నియోజకవర్గాల్లో ఇప్పటికే 8,750 ఇళ్ల్లు మంజూరు చేశామని మొత్తం కలిపి ఇప్పటివరకు గిరిజనులకు 22,016 ఇళ్లు మంజూరైనట్టు ఆయన వెల్లడించారు. ఇందిరమ్మ హౌసింగ్ పథకం పునఃప్రారంభం ద్వారా గిరిజనులకు పెద్దఎత్తున లబ్ధి చేకూరనుందని, ఇది వారి స్థిర నివాస కలను నెరవేర్చడమే కాక, భవిష్యత్ తరాలకు భద్రతను కల్పించనుందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఇళ్లకు తక్షణమే లబ్ధిదారులను గుర్తించి ఇండ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణంలో మరింత క్రియాశీలకంగా వ్యవహారించాలని ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇళ్ల నిర్మాణం జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆయన ఆదేశించారు.