
హైదరాబాద్, జూన్ 7: తెలంగాణ రాష్ట్రలోకి నైరుతి రుతుపవనాల ఆగమనంతో గత కొన్ని రోజులుగా అడపాదడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయితే గత రెండు మూడు రోజులుగా వాతావరణంలో మళ్లీ మార్పులు ప్రారంభమైనాయి. దీంతో పగలి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగంతో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపం చూపుతుండడంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించినా.. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ నగరమంతా వర్షం దంచికొట్టింది. బోరబండ, అమీర్పేట, బంజారాహిల్స్లో మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో వర్షం ధాటికి రహదారులు నీట మునిగాయి.
శనివారం రాత్రి వరకు తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రాగల 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో జూన్ 11 (బుధవారం) వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్నాటక, తెలంగాణ మీదుగా కోస్తా ఆంధ్ర వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ద్రోణి బలపడింది. ఉత్తర ఇంటీరియర్ కర్నాటక, పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.