
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్పై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కాసుల కక్కుర్తి వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ అంటుంటే.. కాళేశ్వరం ప్రాజెక్ట్పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి అధికార పార్టీ ఆరోపణలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్పై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రాణహిత చేవెళ్ల రూ.30 వేల కోట్లతో పూర్తి అయ్యేది.. కానీ బీఆర్ఎస్ లక్ష కోట్ల ప్రజాధనం వృధా చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని నిప్పులు చెరిగారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ హయాంలోనే కట్టారు.. వాళ్ల ప్రభుత్వంలోనే కూలిపోయిందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినా ప్రత్యామ్నాయంతో పంటలు పండించామని.. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో దిగుబడి వచ్చిందని తెలిపారు. కృష్ణా, గోదావరి నీటి పంపకాల్లోనూ బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. అప్పటి కేబినెట్ సబ్ కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్ట్తో సంబంధం లేదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫౌండేషనే కూలిపోతే లేదు రెండే పిల్లర్లు కూలిపోయాయని హరీష్ రావు అనడం సరికాదని చురకలటించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణమే అనుమానస్పదమని ఎన్డీఎస్ఏ అంటోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపూ హరీష్ రావు అవాస్తవిక ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్లలో మేడిగడ్డలో 162 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోశారు. వరదలు రావడంతో అందులో 63 టీఎంసీలు మళ్లీ సముద్రంలోకి వదిలారు. కేవలం 99 టీఎంసీలతో 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఎలా ఇచ్చారో హరీష్ రావు సమాధానం చెప్పాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. నీటి మళ్లింపు కోసం కాదు.. నిధుల మళ్లింపు కోసమే కాళేశ్వరం ఆనకట్టలు కట్టారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ అవినీతికి కాళేశ్వరం ఆనకట్టలే ప్రత్యక్ష సాక్షమని ఘాటు ఆరోపణలు చేశారు.
రూ.30 వేల కోట్లతో పూర్తయ్యే తమ్మిడిహట్టి ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. కాళేశ్వరం ఆనకట్టల వైఫల్యానికి ప్రధాన కారకులు కేసీఆర్, హరీష్ రావు అని ఆరోపించారు. నాసిరకం పనులతో కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు భేషరతుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కమీషన్ల కక్కుర్తికి కాళేశ్వరం ప్రాజెక్ట్ బలైందని ఫైర్ అయ్యారు. నీటి పారుదల శాఖలో గత బీఆర్ఎస్ ప్రభుత్వానివి తప్పుడు నిర్ణయాలని విమర్శించారు. బీఆర్ఎస్ కమీషన్ల కక్కుర్తితో రాష్ట్రానికి శాశ్వత నష్టం జరిగిందని ఆరోపించారు.