
ఓ వివాదంలో ఎస్సై కాంగ్రెస్ నాయకుడి చెంప చెల్లుమనిపించడంతో అదే స్థాయిలో ఎస్సైపై కూడా కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్ ఐ పై కాంగ్రెస్ నాయకుడు దాడికి పాల్పడ్డ ఘటన శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో చోటుచేసుకుంది. తల్లాడ మండలానికి చెందిన రాయల రాము అనే యువ కాంగ్రెస్ నాయకుడు తన అనుచరులతో కలిసి కల్లూరు ఎన్ ఎస్ పి సెంటర్లో ఉన్న చౌదరి హోటల్ కు వెళ్లి తినటానికి అర్డర్ ఇచ్చారు.
Also Read:Tejashwi Yadav: తృటిలో తప్పించుకున్న తేజస్వి యాదవ్.. ముగ్గురు భద్రతా సిబ్బంది గాయాలు..
వాళ్ళు ఇచ్చిన అర్డర్ లేదని చెప్పటంతో హోటల్ యజమాని, సిబ్బందిపై వాగ్వాదానికి దిగారు సదరు వ్యక్తులు. ఇరురుపక్షాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాము అంతటితో ఆగకుండా తన అనుచరులతో కలిసి హోటల్ పై దాడికి పాల్పడడంతో హోటల్ నిర్వాహకుడు కల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్ ఐ హరిత సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని గొడవను నిలువరించే ప్రయత్నం చేసింది. ఈక్రమంలో మహిళా ఎస్సై హరిత, రాముకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్సై పట్ల రాము దురుసుగా ప్రవర్తించడంతో ఎస్సై రాము చెంప చెల్లు మనేలా కొట్టింది. దీనితో రాము కూడా ఎస్ఐ పై దాడికి పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. కల్లూరు పోలీసులు రాముతో పాటు తన అనుచరులు ఆరుగురుని అదుపులోకి తీసుకొని వీ.ఎం.బంజర్ పోలీస్ స్టేషన్ కు తరలించి ట్రీట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయం తెలిసి పోలీసులపైనే దాడులకు పాల్పడడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.