
గద్వాల, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో మహిళా, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అలిమ్కో సంస్థ ద్వారా దివ్యాంగులకు పరికరాలు అందించారు. జిల్లాలోని 93 మంది దివ్యాంగులకు రూ.21.27 లక్షలతో 114 పరికరాలు అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులు పంపిణీ చేసిన పరికరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, సంక్షేమ ఆఫీసర్ సునంద, సంస్థ ప్రతినిధి సునీత దాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ వడ్ల కొనుగోళ్లపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. రైతులకు ఆన్లైన్ ద్వారా వెంటనే చెల్లింపులు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 90 శాతం వడ్లను సేకరించామని, మరో వారం రోజుల్లో 100 శాతం కంప్లీట్ చేయాలన్నారు.
‘బడిబాట’ పకడ్బందీగా నిర్వహించాలి
ప్రభుత్వ పాఠశాలలో స్టూడెంట్స్ సంఖ్యను పెంచడమే కాకుండా డ్రాప్ అవుట్ కాకుండా ఉండేందుకు బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. పాఠశాల ప్రారంభానికి ముందే స్టూడెంట్ లకు స్కూల్ డ్రెస్సు అందించాలన్నారు. స్కూళ్లలో సమస్యలను స్కూల్ వారీగా ఇస్తే తక్షణమే పరిష్కార చర్యలు తీసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డీఈవో అబ్దుల్ గని, డీపీవో నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.