
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. శనివారం (జూన్ 7) ఉదయం నుంచి తీవ్రమైన ఎండ, ఉక్కుపోత ఉండగా.. మధ్యాహ్నానికి వెదర్ ఒక్కసారిగా కూల్ అయ్యింది. నగరంలోని జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రమంజిల్, లక్డీకపూల్తో పాటు పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది.
ఒక్కసారిగా వర్షం కురువడంతో నగరంలోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పలు ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలు, వరద నీరు నిల్వ ఉండే చోట్ల సహయక చర్యలు చేపట్టారు.
ట్రాఫిక్ పోలీసులు కూడా వెంటనే అప్రమత్తమై వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నారు. సాయంత్రం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు సూచించారు. గత రెండు రోజులుగా తీవ్రమైన ఎండలకు ఉక్కిరిబిక్కిరి అయిన నగరవాసులు వర్షం కురవడంతో కాస్త ఉపశమనం పొందారు.