. 2 minutes
Trumps Big Beautiful Bill Impacts Funds Transferred To India

Trump New Bill: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘‘బిగ్, బ్యూటీఫుల్ బిల్లు’’ ఆ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, ఈ బిల్లుపై ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకున్నారు. అయితే, ఈ బిల్లు ఇప్పుడు భారత్‌కి వచ్చే నిధులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్రపంచ రెమిటెన్స్(విదేశాల్లో పనిచేస్తున్నవారు స్వదేశంలోని తమవారికి పంపే నిధులు) ప్రవాహాలను మార్చే నిబంధనలు ఈ బిల్లులో ఉన్నాయి. ప్రపంచంలోనే అమెరికా నుంచి రెమిటెన్స్ స్వీకరించే అగ్రదేశంగా భారత్ ఉంది. 2024లో భారత్‌కు ఏకంగా 129 బిలియన్ డాలర్లకు పైగా నిధులను, ఆ దేశంలో ఉంటున్న మనవాళ్లు పంపించారు. మే 22న, యుఎస్ హౌస్ 215-214 తేడాతో బిల్లును ఆమోదించింది. రెమిటెన్స్ బదిలీలపై 3.5 శాతం పన్నును విధించే నిబంధన ఈ బిల్లులో ఉంది. ముందుగా, 5 శాతం ఉన్నప్పటికీ, ఒత్తిడి కారణంగా దీనిని తగ్గించారు.

గ్రీన్ కార్డ్ హోల్డర్లు, H-1B ఉద్యోగుల వంటి తాత్కాలిక వీసా వర్కర్ల వంటి చట్టబద్ధమైన నివాసితులు సహా విదేశీ కార్మికులు యునైటెడ్ స్టేట్స్ నుండి సొంతదేశాల్లో ఉంటున్న తమ వారికి బదిలీ చేసే నిధులను ఈ నిబంధన లక్ష్యంగా చేసుకుంది. దీని వల్ల భారతదేశంలోని వారి కుటుంబాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ప్రతిపాదిత బిల్లును బిలియనీర్ ఎలాన్ మస్క్ తీవ్రంగా విమర్శించారు. ‘‘ఒక బిల్లు పెద్దదిగా లేదా అందంగా ఉంటుంది, కానీ రెండుగా ఉండొచ్చని నాకు తెలియదు’’ అని ఆయన అన్నారు.

భారత్‌పై ప్రభావం:

ప్రపంచ బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం, 2024 లో మాత్రమే భారతదేశం దాదాపు $129 బిలియన్ల చెల్లింపులను అందుకుంది. ఇది పాకిస్తాన్ ($67 బిలియన్) , బంగ్లాదేశ్ ($68 బిలియన్) వార్షిక బడ్జెట్‌లకు దాదాపు సమానం. ఈ నిధులను అమెరికాలోని భారతీయ వర్కర్లు పంపుతున్నారు. ట్రంప్ సర్కార్ తీసుకువచ్చిన ఈ బిల్లు వల్ల భారతదేశంలోని మిలియన్ల కుటుంబాలకు మద్దతు ఇచ్చే నిధుల ప్రవాహంపై ప్రభావం పడుతుంది. టాక్స్ పెచండంతో వచ్చే నిధులు తగ్గవచ్చు. గత 10 సంవత్సరాలలో, భారతదేశం యొక్క మొత్తం చెల్లింపులు 57 శాతం పెరిగాయి. మొత్తం మీద, 2014 నుంచి 2024 మధ్య, భారతదేశం దాదాపు 1 ట్రిలియన్ డాలర్లు ($982 బిలియన్) చెల్లింపులను అందుకుంది.

వలస కార్మికులపై ప్రభావం:

భారతదేశ అంతర్జాతీయ వలస జనాభా 1990లో 6.6 మిలియన్ల నుండి 2024 నాటికి అంచనా ప్రకారం 18.5 మిలియన్లకు పెరిగింది. ఈ వలసదారులలో ఎక్కువ భాగం గల్ఫ్‌లో ఉన్నప్పటికీ, గణనీయమైన వాటా ఇప్పుడు అమెరికా వంటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలో ఉంది. భారతీయ ఐటీ నిపుణులు, హెల్త్ కేర్, ఆర్థిక, ఇంజనీరింగ్ వంటి అధిక సంపాదన రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు.

ఇటీవలి గణాంకాలు USలోని దాదాపు 78 శాతం మంది భారతీయ కార్మికులు అధిక ఆదాయ వృత్తులలో పనిచేస్తున్నారు. ఇది US నుండి వచ్చే మొత్తం చెల్లింపులలో గణనీయమైన పెరుగుదలకు దారి తీసింది. అమెరికన్ పౌరులు కాని వారు విదేశాలకు పంపే చెల్లింపులపై అమెరికా పన్ను భారత్‌లో ఆందోళన పుట్టిస్తోంది. ఈ బిల్లు చట్టంగా మారితే ప్రతీ ఏడాది భారత్ అందుకుంటున్న నిధుల్లో బిలియన్లు నష్టపోవచ్చు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.